అధిష్టానంతో ఢీ: కిరణ్ కొత్త పార్టీలోకి రెబల్ ఎంపీలు?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ.. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆలిండియా కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి కదలికలపై దృష్టి సారించేందుకే దిగ్విజయ్ హైదరాబాద్కు వస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు గత కొంత కాలంగా మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో పలుమార్లు కిరణ్ కుమార్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. దిగ్విజయ్ సింగ్ పిలిచినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అతన్ని కలిసేందుకు ఆసక్తి చూపనట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ ఏర్పాటులో భాగంగానే ఆరుగురు ఎంపీలతో యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టించాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.
తన నేతృత్వంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. తాము యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంలో సఫలీకృతమైనట్లు ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, రాయపాటి సాంశివరావు, జివి హర్షకుమార్, సబ్బం హరి అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే వీరందరూ కూడా కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది.
రాష్ట్రమంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణలు కూడా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్ అధిష్టానానికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పెరిగిన అంతరాన్ని తగ్గించి, పార్టీలోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.