నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతిపై ఢిల్లీలో స్పందించారు రఘురామ కృష్ణం రాజు. నలంద కిషోర్ది ముమ్మాటికీ పోలీసుల హత్యే అని ఆరోపణలు చేశారు. నలంద కిషోర్ తనకు మంచి మిత్రుడని గుర్తుచేసుకున్న రఘురామ కృష్ణం రాజు కిషోర్ మృతికి కారణమైన పోలీసులపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ నుంచి కర్నూలుకు కారులో..
గతంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారని నలంద కిషోర్ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని ఆ సమయంలో ఆయన్ను విశాఖ నుంచి కర్నూలుకు కారులో తరలించారని చెప్పారు. ఆ సమయంలో కర్నూలులో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తన మిత్రుడు నలంద కిషోర్ కరోనాతోనే చనిపోయినట్లుగా తనకు సమాచారం అందిందని చెప్పిన రఘు రామ కృష్ణం రాజు... పోలీసులు కర్నూలుకు తీసుకెళ్లడంతోనే నలంద కిషోర్కు కరోనా సోకిందని ఆరోపణలు చేశారు. దీన్ని హత్యగానే భావించాల్సి ఉంటుందని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ధ్వజమెత్తారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు
ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న రఘురామకృష్ణం రాజు తాజా వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కోర్టులు చెప్పినట్లుగా జగన్ ప్రభుత్వం నడుచుకోవాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని నిప్పులు చెరిగారు రఘురామ కృష్ణం రాజు. అంతేకాదు గతంలో వైసీపీ తరపున సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినప్పుడు గత ప్రభుత్వం ప్రశ్నిస్తే నాడు ప్రతిపక్ష నేతగా జగన్ విమర్శించారని గుర్తు చేసిన రఘురామ కృష్ణం రాజు ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఇది ఇలానే కొనసాగితే ప్రజలే తిరగబడే రోజు ఎంతో దూరంలేదని రెబల్ ఎంపీ అన్నారు.
Recommended Video
జస్టిస్ కనగరాజ్తో పిటిషన్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించాలని కోర్టులు చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆదిశగా ఆదేశాలు ఇవ్వకపోగా... జస్టిస్ కనగరాజ్తో మరో పిటిషన్ వేయించేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారం తన వద్ద ఉందని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. కోర్టు తీర్పులను ధిక్కరిస్తే సమస్య కొని తెచ్చుకున్నట్లు అవుతుందని రఘురామ హెచ్చరించారు. అయితే ఇదంతా సీఎం జగన్కు తెలియకుండా కొందరు వెనక ఉంది పావులు కదుపుతున్నారని రఘురామ కృష్ణం రాజు చెప్పారు.
సంక్షేమ పథకాలే కాదు.. ప్రజల సంక్షేమం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ఇక తన మిత్రడు నలంద కిషోర్ మృతికి కారణమైన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రఘు రామకృష్ణం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నలంద కిషోర్ గుండెపోటుతో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.