చివరి నిమిషంలో రఘురాముడి ఎత్తులు- అనర్హత, సస్పెన్షన్ అడ్డుకోవాలంటూ హైకోర్టుకు...
వైసీపీ తరఫున గెరిచి ఆ పార్టీపై కత్తులు దూసి అనర్హత ముంగిట నిలిచిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఇక తనపై వేటు తప్పదని తెలిసి చివరి క్షణంలో ఎత్తుగడలకు తెరలేపారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీ తనపై ఎలా చర్యలు తీసుకుంటుందంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగిన ఆయన... ఇప్పుడు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టు మెట్లెక్కారు. వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామపై అనర్హత వేయాలని కోరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
రఘురాముడి ఎత్తుగడలు...
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీనే ధిక్కరించి వేటు వేస్తే ఎంచక్కా బీజేపీలో చేరిపోదామని రంగం సిద్ధం చేసుకున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ వ్యూహాలతో తనపై అనర్హత పడితే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని ఎదుర్కొని మళ్లీ గెలవడం సాధ్యం కాదని రాజు గారికి అర్ధమైపోయినట్లుంది. దీంతో తనపై వైసీపీ అధిష్టానం.... అనర్హతతో పాటు సస్పెన్షన్ విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చివరి క్షణాల్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన వైసీపీపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నా తప్పేంలేదు.. ఇక మీరే దిక్కు...
వైసీపీ తనపై అనర్హత, సస్పెన్షన్ వంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశముందని, వాటిని అడ్డుకోవాలని తన పిటిషన్ లో రఘురామకృష్ణంరాజు హైకోర్టును అభ్యర్ధించారు. వైసీపీ చెబుతున్నట్లుగా తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ మీద వచ్చాయని, యువజన, రైతు, శ్రామిక పార్టీ తరఫున రాలేదని తన పిటిషన్లో ప్రస్తావించారు. అంటే వాస్తవ పరిస్ధితుల కంటే సాంకేతిక అంశాల ఆధారంగా వైసీపీ చర్యలు తీసుకోకుండా అదేశాలు ఇవ్వాలని మాత్రమే రఘురామకృష్ణంరాజు పిటిషన్లో కోరినట్లయింది.
సోమవారం వరకూ ఆగాల్సిందే...
వైసీపీ చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసినా ప్రస్తుతం అది వెంటనే విచారణకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులను మాత్రమే హైకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. మిగతా కేసుల విచారణలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పిటిషన్ నూ హైకోర్టు సోమవారం విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరిందే కానీ ఇంకా స్పీకర్ కానీ, పార్టీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా దాన్ని అడ్డుకోవాలని కోరుతుండటంతో పిటిషన్ ను అత్యవసరంగా భావించాల్సిన అవసరం లేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.