ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధంపై తిరుగుబాటు: అమలుచేస్తే మేమేంటో చూపిస్తాం
ఏపీ సర్కార్ వైద్య శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది. అందులో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై కొరడా ఝుళిపించటానికి రంగం సిద్ధం చేస్తుంది. సుజాతా రావు కమిటీ సూచనల మేరకు జగన్ సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించే ప్రణాళికకు శ్రీకారం చుట్టిన నేపధ్యంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ ను బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న వైద్యులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, బయట ప్రైవేటు క్లినిక్లు నిర్వహించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల మీద పెద్దగా శ్రద్ధ పెట్టటం లేదని సుజాతారావు కమిటీ అభిప్రాయం వ్యఖం చేసి ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చెయ్యకుండా బ్యాన్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం చేసేలా వైద్యుల పనితీరు ఉంటుందని చెప్పటంతో జగన్ సర్కార్ బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ వైద్యులు తప్పు పడుతున్నారు.
ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తే పోరాటం చేస్తామని చెప్తున్న వైద్యులు
అలా నిషేధం విధిస్తే పోరాటం చేస్తామని తేల్చి చెప్తున్నారు. అంతే కాదు ఒకవేళ ప్రభుత్వం అలా నిషేధం విధిస్తే మూకుమ్మడిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.దీనిపై జగన్ సర్కార్ పై సమరానికి సై అంటున్నారు వైద్యులు . జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల్లో ఆందోళన నెలకొన్న నేపధ్యంలో సమావేశమైన వీరు ప్రభుత్వ ఈ నిర్ణయం విషయంలో తమతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఈ తరహా ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాయని గుర్తు చేస్తున్నారు.
ప్రైవేటు ప్రాక్టీస్ ను నిషేధిస్తే తాము ప్రభుత్వంలో కొనసాగలేమంటున్న వైద్యులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల మంది వైద్యులు వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో , వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉన్నారు. రాష్ట్రంలోని 900 మంది స్పెషలిస్టులు ఈ రెండు విభాగాల్లోనే పనిచేస్తున్న పరిస్థితి ఉంది . ఇక తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం కూడా ఈ రెండు విభాగాల వైద్యులపైనే పడనుంది. ముఖ్యంగా డీఎంఈ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ ను నిషేధిస్తే తాము ప్రభుత్వంలో కొనసాగలేమని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు పలు స్పెషలిస్టులు .
మూకుమ్మడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామని హెచ్చరిక
అవసరమైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామని చెప్తున్న వైద్యులు ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే దాదాపు 500 మంది వైద్యులు ప్రభుత్వ సేవల నుంచి విరమించుకునే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో డాక్టర్లు అన్నంతపని చేస్తే మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం వుంటుంది. మరి జగన్ సర్కార్ దీనికి ప్రత్యామ్నాయం సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.