సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నాం: కెవిపిపై డిజిపి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై సిబిఐ నుంచి రెడ్కార్నర్ నోటీసు అందిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ప్రసాదరావు తెలిపారు. అయితే ప్రొవిజనల్ అరెస్టు వారెంట్ రాలేదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో ఆ విషయం చెప్పారు.
వారెంట్స్పై సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కెవిపి పార్లమెంట్ సభ్యుడు అయినందున నిఘా పెట్టలేదని ప్రసాదరావు తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్పోల్ కెవిపికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై అమెరికాలోని చికాగోలో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లు, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1.85 కోట్ల డాలర్లు (మన లెక్కలో చెప్పాలంటే 110.81 కోట్ల రూపాయలు) లంచాలుగా ఇచ్చేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయినట్లు సమాచారం.
ఈ అక్రమ వ్యాపారం అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీన్ని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. గత ఏడాది జూన్ 13వ తేదీన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సీల్ చేసిన ఈ కేసు వివరాలను వెల్లడించింది. ఈ అంతర్జాతీయ ముఠా నుంచి కెవిపి తనకోసం, తన తరఫు వారి కోసం ముడుపులు ఆశించారంటూ ఆయనపై గరిష్ఠంగా ఐదు అభియోగాలు మోపింది.