చంద్రబాబు పొలంలో ఎర్ర దుంగలు?: పరువు తీస్తున్నారని అధికారులపై సీరియస్
అమరావతి: శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. విదేశాల్లో ఎర్రచందనానికి ఉన్న విలువను గుర్తించిన అక్రమార్కులు అడవిలోని ఎర్రచందనం చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారు. నిన్నటి వరకు ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
అయితే చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ, పోలీసు శాఖలు 'ఎర్ర' స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాయి. ఎర్రచందనం దొంగలు భయభ్రాంతులకు గురయ్యేలా ఆ రెండు శాఖలు టాస్క్ పోర్స్ పేరిట ముమ్మర దాడులు చేస్తున్నాయి.
అంతేకాదు ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించడం కోసం ఎన్కౌంటర్లు కూడా జరిపారు. ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసిన సీఎంగా చంద్రబాబుకు పేరు కూడా వచ్చింది. అయితే మంగళవారం విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు ఆయన కేబినెట్ మంత్రులు షాక్కు గురయ్యారు.
చంద్రబాబుకు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో ఇంటితో పాటు కొంత వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. కానీ, పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్లకు గంతలు కట్టి స్మగ్లర్లు ఏకంగా సీఎం సొంత గ్రామంలోని సొంత భూమిలోనే దుంగలను నిల్వ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
చంద్రబాబు నోరు విప్పేదాకా ఈ విషయం ఏ ఒక్కరికి తెలియదు. అయితే తన పొలంలోనే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షా సమావేశంలో స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించి, అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
''పరువు తీస్తున్నారు. సిగ్గనిపిస్తుంది'' అంటూ సీరియస్ అయ్యారని సమాచారం. అప్పటి వరకు ఈ విషయం ఇతర శాఖల అధికారులకుగానీ, మంత్రులకుగానీ తెలియకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తోంది. సమావేశంలో కూర్చున్న అటవీ శాఖాధికారుల వైపు చూడటానికి కూడా ఇష్టపడని చంద్రబాబు... తన బాధను, కోపాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.