మళ్ళీ రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు .. శేషాచల అడవుల్లో పోలీసులపై రాళ్ళు రువ్వి పరారీ
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పోలీసులపై దాడికి దిగారు. ఒక్కసారిగా పోలీసుల మీద రాళ్ళ వర్షం కురిపిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్ళారు టాస్క్ఫోర్స్ సిబ్బంది. ఇక వీరిపై స్మగ్లరు తిరగబడి రాళ్ళు రువ్విన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో జరిగింది.
30 న సచివాలయ నియామక పత్రాలు .. అక్టోబర్ 2న సచివాలయ భవనం ప్రారంభించనున్న సీఎం జగన్
శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ బృందం కూంబింగ్ చేపట్టింది. మూలపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో అక్కడ ఎర్రచందనం దుంగలను తీసుకు వెళుతున్న స్మగ్లర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పొదల చాటున దాక్కున్న వారు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపగా.. కూలీలు ఎర్ర చందనం దుంగలను వదిలివేసి అక్కడి నుండి పరారయ్యారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు . పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జమునమత్తూరు తాలూకా నాచమలై గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.
చీకటిగా ఉండటంతో స్మగ్లర్లను వెంబడించిన ప్పటికీ పోలీసులు మిగతా వారిని పట్టుకోలేకపోయారు. పట్టుబడిన స్మగ్లర్ ద్వారా మిగతా వారి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో శేషాచలం అడవుల్లో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు అని, యథేచ్చగా ఎర్రచందనం దుంగలను తరలించే ప్రయత్నం జరుగుతోంది అని తెలుస్తోంది.