ఒక్కసారిగా 100 మంది!: శేషాచలంలో హైటెన్షన్.. పోలీసులనే రౌండప్ చేయాలనుకున్న స్మగ్లర్స్..
కడప: శేషాచలం అడవుల్లో పోలీసులు భారీ ఎర్రచందనం డంప్ను గుర్తించారు. రోజు లాగే అడవిలోకి వెళ్లిన స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ టీమ్ అడవిలో కూంబింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండటం వారి కంటపడింది.
తేండ్రగంటకు సమీపంలోని అభయారణ్యంలో సుమారు 8 కిలోమీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత.. ఓ వ్యక్తి ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ రావడం కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. దుంగను అక్కడే పడేసి అతను అడవిలోకి పరుగందుకున్నాడు. ఆ తర్వాత అతన్ని తరుముకుంటూ వెళ్లిన పోలీసులు పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు.
అక్కడ వాళ్ల చిత్రాలు:
స్మగ్లర్ పరిగెత్తుకుంటూ వెళ్లిన వైపు పోలీసులు కూడా పరిగెత్తారు. అతని అడుగు జాడల ఆధారంగా సుమారు 600మీ. లోపలి వరకు వెళ్లారు. అక్కడో ఎర్రచందనం డంప్ కనిపించడంతో.. స్మగర్లంతా అక్కడే మకాం పెట్టారని అర్థమైంది. ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా..158 దుంగలతో పాటు బియ్యం, తమిళనాడు రాజకీయ నేతల, సినీ నటుల చిత్రాలు, ఇతర వస్తువులు కనిపించాయి.
ఎర్ర దొంగలపై పోలీసుల కాల్పులు: 150ఎర్రచందనం దుంగలు సీజ్
ఒక్కసారిగా 100మంది:
కూంబింగ్ పోలీసులు డంప్ వద్దకు చేరుకున్న సమయంలో స్మగ్లర్లు భోజనానికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. తమను చూసి పరిగెత్తిన స్మగ్లర్.. మిగతా స్మగ్లర్లకు సమాచారం అందిచడంతో వారంతా అప్రమత్తమయ్యారు. పోలీసులు కేవలం 9మంది మాత్రమే ఉన్నారని గుర్తించి దాదాపు 100మంది స్మగ్లర్లు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు.
అడవిలో ఉద్రిక్తతలు:
పోలీసులను బెదిరింపులకు గురిచేయడానికి స్మగ్లర్లు రాళ్లు విసిరారు. తమ వద్ద ఆయుధాలున్నాయని, లొంగిపోవాలని చెప్పినా వారు వినలేదు. దీంతో స్పెషల్ రిజర్వ్ ఫోర్స్ ఆర్ఐ సత్యనారాయణ తన వద్ద ఉన్న 12 బోర్పంపు యాక్షన్ గన్తో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీస్ బృందంలోని మరో ఆరుగురి వద్ద కూడా మారణాయుధాలు ఉండటంతో వీరంతా గుంపుగా నిలబడి కాల్పులకు సిద్దపడ్డారు. దీంతో స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారు.
చంద్రబాబు పొలంలో ఎర్ర దుంగలు?: పరువు తీస్తున్నారని అధికారులపై సీరియస్
రాత్రంతా జల్లెడ పట్టిన పోలీసులు:
కూంబింగ్ ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న ఐజీ కాంతారావు తక్షణం మరో 5 స్పెషల్ టీమ్స్ ను అడవిలోకి పంపించారు. దీంతో పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీస్ టీమ్స్ రాత్రంతా జల్లెడ పట్టాయి. దాదాపు 5 రోజుల నుంచి స్మగ్లర్లు అక్కడ తిష్టవేసినట్లు గుర్తించారు.
తమిళ రాజకీయ నేతలు, సినీ తారల చిత్రాలు అక్కడ లభించాయి. అక్కడ దొరికిన వివరాల ఆధారంగా 79మంది స్మగ్లర్ల పేర్లను వారు కొట్టిన చెట్ల వివరాలను పోలీసులు ఓ కాగితంపై రాసుకున్నారు. వనదేవతలకు పూజ చేసిన ఆనవాళ్లు కూడా అక్కడ లభ్యమవడంతో.. మరికాసేపట్లో దుంగలను తరలించడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు.
ఎవరీ స్మగ్లర్స్:
పారిపోయిన స్మగ్లర్లను తమిళనాడుకు చెందిన జువ్వాదిమలై తెగవారిగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో 158 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా. 2013లో ఇద్దరు అటవీ అధికారుల్ని స్మగ్లర్లు గొడ్డళ్లతో నరికి చంపిన సంఘటన తర్వాత మళ్లీ స్మగ్లర్లు అదే స్థాయిలో పోలీసులపై తిరగబడటానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.