ఏపీకి రూ.1,000 కోట్లు వస్తే, 40,000 కోట్లు పోయింది! టెక్నాలజీపై బాబు దృష్టి
చిత్తూరు: ఎర్రచందనంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్జించిన దాని కంటే కోల్పోయిందే ఎక్కువగా ఉంది! ఇటీవల ఎర్రచందనం వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.1000 కోట్లు ఆర్జించింది. కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ వల్ల ఈ మూడేళ్లలో రూ.40,000 కోట్ల వరకు నష్టపోయింది.
దాదాపు రూ.40,000 కోట్ల విలువైన నలభై వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను దొంగలు ఎత్తుకు పోయారు. ఎర్రచందనం దొంగలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలను తీసుకుంటోంది. కానీ, అరికట్టడం అంత సులభం కావడం లేదు.
తాజాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు మరో కొత్త సూచన ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అది స్టాటిక్ బెలూన్ కెమెరాలు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగిలించుకుపోతున్న వారిని అరికట్టేందుకు బెలూన్ కెమెరాలు ఉపయోగించడం మంచిదని ప్రభుత్వానికి సూచించారు.
ఈ నేపథ్యంలో శేషాచలం అడవులు ఉన్న చిత్తూరు, కడప, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈ బెలూన్ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 24/7 పాటు ఎర్రచందనం దొంగల పైన నిఘా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం
గత మూడేళ్ల లెక్కలు తీస్తే... ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే జరిగిన నష్టమే నలభై రెట్లు ఉంది. ఎర్రచందనం వేలం ద్వారా ఏపీ ఇటీవల రూ.1000 కోట్లు ఆర్జించింది. కానీ ఈ మూడేళ్లలో రూ.40,000 కోట్ల మేర ఏపీ స్మగ్లింగ్ వల్ల నష్టపోయింది.
పోలీసులు 12,700 కేసులు నమోదు చేశారు. 19,852 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్ర చందనం దొంగిలించేందుకు ఉపయోగించిన 7,300 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ పోలీసులు ఇటీవలే ఎర్రచందనం స్మగ్లర్ హసన్ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అతను నేపాల్ మీదుగా చైనా వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పోలీసులు పట్టుకున్నారు.
శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్లు లేదా స్టాటిక్ బెలూన్ కెమెరాలను ఉపయోగించే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు. చర్యలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు.