తిరుమల శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు ..టాస్క్ఫోర్స్ పోలీసులపై దాడి
తిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా వీడటం లేదు . ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లరు రాళ్ళతో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో జరిగింది.
శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ బృందం కూంబింగ్ చేస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం భీమవరం ఘాట్ రోడ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. తమిళనాడుకు సంబంధించిన ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూడడంతోనే వాళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. స్మగ్లర్ల దాడితో ఉలిక్కిపడినా వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారితో తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా దాడి కొనసాగిన తరువాత స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి పారిపోయారు.
పోలీసుల నుంచి తప్పించుకున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రస్తుతం శేషాచల అడవిని జల్లెడ పడుతున్నారు. మొత్తం 35 మంది తమిళ స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు.పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు స్మగ్లర్లు వినియోగించిన టార్చ్ లైట్ లను,వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలను,అక్కడ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.