మస్తాన్ వలీ కొట్టాడు: నీతు అగర్వాల్ ట్విస్ట్, వెక్కివెక్కి ఏడ్చింది
కర్నూలు: ఎర్ర చందనం స్మగ్లింగ్తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ తెలుగు నటి నీతు అగర్వాల్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! ఆమె హైదరాబాదు నుండి బెంగళూరుకు పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీలో నీతూకు గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆమె బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది.
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు.
నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలా ఉండగా, ఎర్ర చందనం కేసు నేపథ్యంలో నీతు అగర్వాల్ లొంగుబాటు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించకముందే ఆమె బెంగళూరుకు పారిపోయే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. ఆమె హైదరాబాదులో పట్టుబడిందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద పోలీసులకు చిక్కింది.
కాగా, స్మగ్లర్ బాలు అకౌంటకు రూ.లక్ష బదలీ చేసినట్లు నీతు అగర్వాల్ పోలీసులకు చెప్పారు. ఆమె నుండి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపయోగించిన కారును సీజ్ చేశారు. మస్తాన్ వలీ, నీతు అకౌంట్ల మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.