హైదరాబాద్కు గంగిరెడ్డి: చంద్రబాబుపై దాడి సహా ఆరోపణలు, సీఎం చొరవతో..
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్, అలిపిరిలో ఏపీ సీఎం చంద్రబాబుపై దాడి ఘటనలో నిందితుడు కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు ఆదివారం హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇన్నాళ్లు మారిషస్ జైల్లో ఉన్న అతడిని అక్కడి కోర్టు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు బృందానికి అప్పగించింది.
అనంతరం అతనిని మారిషస్ నుంచి ఆదివారం ఉదయం ఢిల్లీకి, మధ్యాహ్నానికి హైదరాబాద్కు తరలించారు. అతనిని శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం మూడు గంటలకు గంగిరెడ్డిని మీడియా ముందు హాజరుపర్చనున్నారు.
గంగిరెడ్డి పై కేసులు
గంగిరెడ్డి పైన కర్నూలు, కడప, చిత్తూరు, హైదరాబాద్ తదితర పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లు మారిషస్ జైల్లో ఉన్న అతన్ని న్యాయస్థానం ఏపీ సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు బృందానికి అప్పగించింది.
విదేశాల్లో ఉన్న నిందితుడిని కోర్టు ద్వారా ఏపీ పోలీసులు ఇలా అదుపులోకి తీసుకోవడం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. కడప జిల్లాకు చెందిన ఈ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఏడాదిన్నరగా విదేశాల్లో తలదాచుకున్నాడు.
2003లో ముఖ్యమంత్రి చంద్రబాబుపైన అలిపిరిలో బాంబుపేల్చి హత్యాయత్నం చేసిన కేసులో మావోయిస్టులకు సెల్ఫోన్లు అందించాడని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈయన గత ఏడాది ఏప్రిల్లో ఎర్రచందనం కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడ్డాడు. మే 16న బెయిల్పై బయటకు వచ్చాడు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టిడిపి అధికారంలోకి వస్తున్నట్లు తేలడంతో గంగిరెడ్డి ఆగమేఘాలపై తప్పుడు సమాచారం ఉన్న పాస్పోర్టుతో మే 18న విదేశాలకు పారిపోయాడు. తొలుత ఇతనిపై కర్నూలు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
అప్పటి వరకూ వివిధ అరబ్ దేశాల మధ్య తిరిగిన గంగిరెడ్డి రెడ్ కార్నర్ నోటీసు జారీతో మారిషస్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోర్ట్ లూయిస్ విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అరెస్టు చేసి విషయాన్ని ఏపీ పోలీసులకు తెలిపారు. అప్పటినుంచి అతన్ని రప్పించడానికి ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లెవారిపల్లెకు చెందిన గంగిరెడ్డి పదిహేనేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్లో పేరొందాడు. కడప జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి మొదటినుంచి సన్నిహితంగా వ్యవహరించాడు. 2013 వరకు ఒక్క కేసు ఇతనిపై నమోదు కాలేదు.
2013లో మాత్రం రాజంపేట గ్రామీణ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. గత ఏడాది కర్నూల్ జిల్లా డోన్ పరిధిలోని వెల్దుర్తి వద్ద మూడువేల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దాని సూత్రధారి గంగిరెడ్డేనని తేలింది. ఆళ్లగడ్డ ప్రాంతం ఆర్ కృష్ణాపురంలో ఎర్రదుంగలు పట్టుబడిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.
దీంతో అక్కడి పోలీసులు కన్నేసి అదుపులోకి తీసుకున్నారు. గంగిరెడ్డి 42 రోజులపాటు డోన్ సబ్ జైల్లో ఉన్నాడు. చివరకు గత ఏడాది మే 16న బెయిల్ పొందాడు. అనంతరం బయటికొచ్చిన మూడు రోజుల్లోనే విదేశాలకు పారిపోయాడు. విషయం తెలుసుకున్న చంద్రబాబు దీనిపై మే 23న గవర్నర్కు లేఖ రాయడంతో విదేశాలకు పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అతని పైన ఎన్నో కేసులు ఉన్నాయి.