మృతులు తమిళులే, పరిహారం ఇవ్వం: చిన్నరాజప్ప
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడు ముఖ్యమంత్రి సెల్వం లేఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యుత్తరం రాశారని ఏపి హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. ఎన్కౌంటర్ ఘటనపై పలువురు మంత్రులతో చంద్రబాబునాయుడు గురువారం సమీక్ష నిర్వించారు.
అనంతరం చిన్నరాజప్ప మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ ఘటనలో మృతి చెందిన వారందరూ తమిళనాడుకు చెందిన వారేనని, వారి కుటుంబాలకు తాము ఎక్స్గ్రేషియా చెల్లించలేమని తెలిపారు. న్యాయ విచారణ జరుపుతున్నామని చెప్పిన ఆయన, నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
అవకాశం లేకనే ఎన్కౌంటర్ చేశాం: డిజిపి రాముడు
పోలీసులకు అవకాశముంటే ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేసేవారని, ఆ విధంగా లేనందునే వారిపై కాల్పులకు పాల్పడాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు అన్నారు. శేషాచలం అడవిలో ఎర్రచందనం తరలిస్తున్న 20 మంది కూలీలను ఇటీవల పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ ఎన్కౌంటర్పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో డిజిపి రాములు గురువారం వివరణ ఇచ్చారు. ఎర్రచందనం కూలీలు పోలీసులపై దాడి చేసిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ‘మాకు అరెస్ట్ చేసే అవకాశముంటే.. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసేవాళ్లం' అని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఎర్రచందనం కూలీలు.. ఇద్దరు అటవీశాఖ అధికారులను, ఓ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా బండలతో కొట్టి చంపారని గుర్తు చేశారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో తాము వారిని ఎందుకు కాల్చకుండా ఉండాలి. వారు మాకు శత్రువులేమి కాదు. అలాంటప్పుడు వారిని పాయింట్ బ్లాంకులో కాల్చి ఎలా చంపుతాం' అని డిజిపి అన్నారు.
పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని డిజిపి రాములు తెలిపారు. ‘విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతీ ప్రశ్నను పరిగణలోకి తీసుకుని జవాబివ్వడం జరుగుతుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు' అని డిజిపి చెప్పారు.
కాగా, కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ ఘటనపై నివేదిక కోరింది. సాధ్యమైనంత తొందరగా ఈ ఘటనపై నివేదికను పంపించాలని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపింది. ఇది ఇలా ఉండగా ఎన్కౌంటర్ ఘటనపై ఇప్పటికే ఏపి సిఎం చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు కొంత సమాచారాన్ని అందించారు.