గుంటూరు జిల్లాలో పేలిన రెడ్మీ ఫోన్, విద్యార్థికి తప్పిన ముప్పు
మరో రెడ్ మి ఫోన్ పేలిపోయిన ఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి మాన్యంలో చోటుచేసుకుంది.
అమరావతి: మరో రెడ్ మి ఫోన్ పేలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఫోన్ యజమాని ఎలాంటి ముప్పులేకుండా తృటిలో తప్పించుకున్నాడు. గుంటూరు జిల్లా రెంటచింతలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి మాన్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్టణానికి చెందిన కొత్తపల్లి అశోక్ అనే విద్యార్థి కొన్ని నెలల క్రితం ఎంఐ కంపెని రెడ్ మి సెల్ ఫోన్ కొనుగోలు చేశాడు. మంగళవారం ఫోన్ ను ఛార్జింగ్ కోసం పెట్టానని, కొంతసేపటి తరువాత ఛార్జ్ అయివుంటుందని భావించి ఫోన్ తీస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలిపోయిందని అశోక్ తెలిపాడు.
అయితే ఈ ఘటనలో అశోక్ కు స్వల్ప గాయాలు మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదు. చార్జింగ్ ఫుల్ అయివుంటుందని భావించి తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఫోన్ పెద్ద శబ్ధంతో పేలిపోవడంతో భయంతో వణికిపోయానని, అయితే తనను దేవుదే కాపాడాడని అశోక్ అంటున్నాడు.
తాను సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా మాట్లాడుతుంటానని, కానీ ఈసారి మాత్రం ఎందుకో అలా చెయ్యలేదని, అందువల్లే తన ప్రాణాలు దక్కాయని అంటున్నాడు. ఏదేమైనా మొబైల్ యూజర్లకు ఇదో హెచ్చరికే...పెద్ద పెద్ద కంపెనీల మొబైల్సే ఇలా పేలిపోతున్న తరుణంలో ఫోన్ వాడకానికి సంబంధించి కనీసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.