ఎపిలో ప్రాంతీయ చిచ్చులు: వైయస్ జగన్ పక్కా ప్లాన్?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రాంతీయ చిచ్చులు పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక వేసినట్లు చెబుతున్నారు. రాయలసీమ చిచ్చు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర చిచ్చు కూడా రగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు కాపు సామాజిక వర్గం అండదండలతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో ముందుకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అమరావతిపై మాత్రమే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టృడం వల్ల మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే ఎజెండాతో ప్రాంతీయ ఆందోళనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ఎంవి మైసురా రెడ్డి సిద్ధపడ్డారు. ఈ నెల 21వ తేదీన ప్రత్యేక రాయలసీమ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాయలసీమ అభివృద్ధికి డిమాండ్ చేయాలా, ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేయాలా అనే అనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
నల్లగొండ జిల్లాతో కలిపి రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వస్తోంది. ఈ సమావేశం జరిగితే తప్ప రాయలసీమ ఉద్యమంలోని తీవ్రత ఏమిటో అర్థం కాదు.
కాగా, ఉత్తరాంధ్రకు చెందన ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, ఆయన బయటకు వస్తారని ప్రచారం సాగుతోంది. ధర్మాన ప్రసాద రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి ఉత్తరాంధ్ర ఉద్యమాన్ని చేపడుతారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అన్యాయం జరుగుతోందని ఆ మధ్య వైయస్ జగన్ అన్న విషయం తెలిసిందే.
కాగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్రనాభం చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 1వ తేదీన కాపుల సమావేశాన్ని ఆయన నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని కూడగట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా నడిపించాలనే ఎత్తుగడతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభంతో ఇటీవల సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఈ ప్రాంతీయ ఉద్యమాల వెనక, కాపు సామాజిక వర్గం ఐక్యం కావడం వెనక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం సాగుతోంది. రాయలసీమ ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బాసటగా నిలువడం, ముద్రగడ పద్మనాభాన్ని అంబటి రాంబాబు కలుసుకోవడం, ధర్మాన ప్రసాద రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు రావాలని అనుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో అందరి చూపు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది.