ఏపీలో టెన్త్ రెగ్యులర్ క్లాసెస్.. ప్రతిపాదనలు రెడీ, వచ్చేనెల 2 నుంచి..?
కరోనా వైరస్ వల్ల స్తంభించిపోయిన జనజీవనం ఒక్కొక్కటీ తేరుకుంటున్నాయి. అయితే పాఠశాలలకు మాత్రం ఇంతవరకు మోక్షం కలగలేదు. అయితే ఏపీలో టెన్త్ తరగతులను రెగ్యులర్గా నిర్వహించాలని అనుకుంటోంది. పాఠశాల తరగతులను 1 నుంచి 8 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తారు. 1 నుంచి 8 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి విద్యార్థులను అనుమతించబోతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు నిర్వహించి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు.
స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందజేస్తారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండనున్నాయి. పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగా ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. కానీ ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.