తమిళనాడులో భూముల రగడ: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
అమరావతి: సదావర్తి సత్రం ఆస్తుల వేలం పైన దాఖలైన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం నాడు కొట్టి వేసింది. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊరట అని చెప్పవచ్చు. తమిళనాడులోని సదావర్తి భూముల పైన రాజకీయ రగడ కొనసాగిన విషయం తెలిసిందే.
సదావర్తి భూముల పేరిట చంద్రబాబు ప్రభుత్వం, టిడిపి నేతలు దోచుకుంటున్నారని ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తమిళనాడులోని 86 ఎకరాల సత్రం భూములను తక్కువ ధరకే వేలం వేసారని ద్రోణంరాజు రవి కుమార్ కొద్ది రోజుల క్రితం హైకోర్టుకు వెళ్లారు.
అత్యంత విలువైన సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను న్యాయస్థానం కొట్టి వేసింది. వేలాన్ని ఆపాలంటూ తమ ముందుకు వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... వేలం నిలిపివేతకు తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది.
వేలం నిలిపివేత దిశగా నిర్ణయం తీసుకునేలా సహేతుక కారణాలు చూపడంలో పిటిషన్దారు విఫలమయ్యారని న్యాయమూర్తి చెప్పారు. ప్రస్తుతం వేలాన్ని రద్దు చేయలేమని, అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో వస్తే, మరోమారు పరిశీలించి విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది.