బాబు, కేసీఆర్లకు చిక్కులే: ఆర్బీఐ ఊరట కొంతే
ముంబై/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు కాస్త ఊరట! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు రుణల రీషెడ్యూల్కు సానుకూలత వ్యక్తం చేస్తూ ఆర్బీఐ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. అయితే, ఆ సానుకూలత వారికి ఊరట కలిగించే అవకాశం లేదు. మొత్తం రైతుల రుణాల మాఫీకి రిజర్వ్ బ్యాంక్ సముఖంగా లేనట్లు తెలుస్తోంది. వరద తాకిడి, కరువు ప్రాంతాల రైతులకు మాత్రమే రుణాల రీషెడ్యూల్కు అనుకూలంగా రిజర్వ్ బ్యాంక్ రాసిన లేఖను బట్టి అర్థమవుతోంది.
మూడేళ్ల పాటు రుణాల రీషెడ్యూలుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది. మూడేళ్లలో ప్రభుత్వం రుణాలు తీర్చగలదా అని ఈ లేఖలో ఆర్బీఐ రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాల పైన నివేదిక పంపాలని ప్రభుత్వాలను కోరింది. ఆ మూడేళ్ల విషయంలో కూడాా క్లారిటీ ఇచ్చింది. ఒక ఏడాది మారిటోరియం, రెండేళ్లు రీషెడ్యూల్ అవకాశం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ స్థితిలో ప్రభుత్వాల నుండి రైతు రుణాల పైన పూర్తిస్థాయి నివేదికను ఆర్బీఐ కోరింది. ఆర్బీఏ లేఖ పైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. రీషెడ్యూలుకు ఏపీ ప్రభుత్వం మూడేళ్లు కాకుండా ఏడేళ్లు కోరింది. ఖరీఫ్ సీజన్ రుణాలకు మాత్రమే వెసులుబాటు ఇచ్చే ఆలోచనలో రిజర్వ్ బ్యాంక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 661 మండలాలకు గాను 575 మండలాలకు మాత్రమే అది వర్తించే అవకాశం ఉంది. వరదతాకిడికి గురైన 462 మండలలాకు మాత్రమే అది వర్తించే అవకాశం ఉంది. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 113 మండలాలకు కూడా అది వర్తిస్తుంది. రబీ సీజన్ రుణాల విషయంపై రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది.
రబీ సీజన్ రుణాలను కూడా రీషెడ్యూల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. మూడేళ్లు కాకుండా రుణాల చెల్లింపునకు ఏడేళ్ల గడువు ఇవ్వాలని కోరాలని ఆలోచిస్తోంది. ఖరీఫ్ సీజన్లో రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించే అవకాశం ఉంది. బంగారంపై తీసుకున్న రుణాలను దానికి పాస్బుక్ ప్రతిని జత చేస్తేనే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. గత ఖరీఫ్లో రైతులు తీసుకున్న 11 వేల రూపాయల రుణాలకు మాత్రమే రీషెడ్యూల్ వర్తించవచ్చునని అంటున్నారు.
కాగా, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణమాఫీకీ ఆర్బీఐ అనుమతించాల్సి ఉంది. అయితే, అది ఆలస్యం కానున్న నేపథ్యంలో రుణాల రీషెడ్యూల్ కోసం ఏపీ ప్రభుత్వం కోరింది. ఇప్పుడు ఆర్బీఐ నుండి లేఖ వచ్చింది.