విజయమ్మ, షర్మిల.. హైకోర్టులో జగన్ ఫ్యామిలీకి ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు, కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. రోడ్డు పైన బైఠాయించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారంటూ విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యుల పైన నమోదైన కేసులో దిగువ కోర్టు విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మే 27వ తేదీన దిల్ కుషా అతిథి గృహం వద్ద సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఈ సమాచారం తెలియడంతో విజయమ్మ, భారతి, షర్మిల తదితరులు అక్కడకు చేరుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు నమోదైంది. పదో ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది. దీనిని నిలుపుదల చేయాలని విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
కూల్చివేతలను ఆపండి: సర్వే
అక్రమ కట్టడాల కూల్చివేతను వెంటనే నిలిపి వేసి, వాటిని క్రమబద్ధీకరించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కేసీఆర్ను డిమాండ్ చేశారు. నిర్మాణం చేసిన కట్టడాలను కూల్చి వేయడానికి తాము వ్యతిరేకమన్నారు. ఈ ప్రభుత్వానికి తాము వాచ్డాగ్లా ఉంటామన్నారు. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకున్న సీమాంధ్రులకూ రక్షణ ఇవ్వాలన్నారు.
తెలంగాణలో 1956 కంటే ముందు ఉన్న వారే స్థానికుల, వారికే ఫీజు రీయంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు. దీనిని అందరికీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తాము ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని, ముఖ్యమంత్రిని ఇంటి నుంచి బయటకు రాకుండా దిగ్బంధం చేస్తామన్నారు.