మతం మారితే మంచి మార్కులు.: నూజివీడు ట్రిపుల్ ఐటీలో జోరుగా మత ప్రచారం, అధికారుల అండ!
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మత ప్రార్థనలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతీ ఆదివారం ఓ మతానికి చెందినవారు ఇక్కడ జోరుగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ముసుగులో క్యాంపస్లోకి ప్రవేశిస్తున్న మత బోధకులు ప్రార్థనలు చేస్తూ విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
స్వేచ్ఛగా మత ప్రచారం
క్యాంపస్లోని పోస్టాఫీసు వద్ద బాలికలకు, హాస్టల్ గదుల్లో అబ్బాయిలతో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ట్రిపుల్ ఐటీ అధికారులు, అధ్యాపకుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే వారిలా స్వేచ్ఛగా క్యాంపస్లో మత ప్రచారం చేసే అవకాశం ఉండదు.
అధికారుల అండ
మెకానిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు, ఆంగ్ల అధ్యాపకురాలు ఒకరు మత బోధకులకు తమవంతు సాయం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీకే చెందిన ఓ అత్యున్నత అధికారి భార్య ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
మతం మారితే మంచి మార్కులంటూ..
విద్యార్థులను వివిధ రకాలుగా ప్రలోభపెడుతూ మతం మార్చుతున్నట్లు ఆరోపణలున్నాయి. తమ మతంలోకి వస్తే మంచి మార్కులు వస్తాయని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఇంత జరుగుతున్నా చర్యలేవీ?
కాగా, ట్రిపుల్ ఐటీలో ప్రార్థనలు జరుగుతున్న విషయం రెండేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన డైరెక్టర్ వీవీ దాసు ఇకపై ఇటువంటివి జరగడానికి వీల్లేదని ఆదేశించారు. అయినప్పటికీ యధేచ్ఛగా ఐఐఐటీ క్యాంపస్లో మత ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.