నెల్లూరు టికెట్లు తిరుమలకు: చంద్రబాబు ప్రచార యావను మాకు అంటగడతారా?: వైసీపీ ఎమ్మెల్యే
విజయవాడ: తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్ లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక ప్రభుత్వానికి సంబంధించిన అన్యమత ప్రచార కార్యక్రమాలను ముద్రించిన ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. అలాంటి ప్రచార యావ తమకు లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నవేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వల జాబితాను ఆయన మీడియాకు విడుదల చేశారు. తిరుమల తిరుపతి బస్ టికెట్ల వెనుక జెరూసలేం, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రచార ఫొటోలను ముద్రించిన ఘటన శుక్రవారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. పవిత్రమైన తిరుమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యమత ప్రచారానికి దిగిందని ఆరోపించాయి.
దీనిపై మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ప్రచార పాపాలను తమకు అంటగడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రచార యావ ఎలాంటిందో అందరికీ తెలిసిందేనని, బస్ టికెట్లపైనా ఆయన ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు తిరుమలకు ఎలా వెళ్లాయనే విషయంపై విచారణ నిర్వహిస్తున్నామని అన్నారు. తిరుమల, తిరుపతికి సంబంధించిన ఏ ఒక్క డిపోనకు చెందిన బస్సుల టికెట్ల వెనుక ఇతర మతాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ముద్రించలేదని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేదని అన్నారు. వాటన్నింటికీ అతీతంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాల వారు వైఎస్ జగన్ ను తమ వాడిగా, తమ కుటుంబ సభ్యుడిగా, తమ ఇంటి పెద్ద కుమారుడిగా భావించి, అద్భుత విజయాన్ని అందించారని అన్నారు. తమ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి కులాన్ని, మతాన్ని అంటగడుతూ తప్పుడు ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్లాది విష్ణు హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క మంత్రి కూడా ప్రజల్లో తిరిగిన సందర్భాలు లేవని, అన్ని చోట్లా చంద్రబాబే ప్రచారం చేసుకునే వారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండాల మాణిక్యాల రావును చంద్రబాబు ఏ మాత్రం గౌరవం ఇచ్చారో తెలిసిన విషయమేనని అన్నారు.
బూట్లు వేసుకుని చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమాలు, పూజలను చేసినప్పుడు భారతీయ జనతాపార్టీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో తిరుమలలో మందుబాబులు తిష్ట వేసిన రోజులు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార యావ కోసం షూటింగ్ ను నిర్వహించి 29 మంది మరణించడానికి కారణమైనప్పుడు గానీ, విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో గుళ్లూ, గోపురాలను కూలదోసిన సందర్భంలో బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పారు.