శిల్పా సోదరులకు బాబు ప్రభుత్వం షాక్, 'జగన్ పాదయాత్ర టైంలో ఎందుకు, ఫిర్యాదు చేస్తాం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం షాకిచ్చింది.
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం షాకిచ్చింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు.
Recommended Video
తాజాగా, తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు షాకిచ్చింది. శిల్పా మోహన్ రెడ్డికి గన్మెన్లను తొలగించింది. శిల్పాతో పాటు నంద్యాల మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన గన్మెన్లను కూడా తొలగించింది.
ప్రభుత్వం నిర్ణయంపై శిల్పా చక్రపాణి ఆగ్రహం
ప్రభుత్వం నిర్ణయంపై శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గన్మెన్ల తొలగింపుపై తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
జగన్ పాదయాత్ర సమయంలోనే
జగన్ ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగిన సమయంలోనే శిల్పా మోహన్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం గమనార్హం. దీనిపై చర్చ సాగుతోంది. వైసీపీ నాయకులు కూడా దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కక్ష సాధింపు చర్య అని మండిపాటు
శిల్పా మోహన్ రెడ్డికి గన్మెన్ల తొలగింపు కక్ష సాధింపు చర్య అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డికి 2 ప్లస్ 2, శిల్పా చక్రపాణి రెడ్డికి 2 ప్లస్ 2, రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డికి వన్ ప్లస్ వన్, చైర్ పర్సన్ సులోచనకు వన్ ప్లస్ వన్ గన్మెన్ల సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భూమా మరణం తర్వాత
కాగా, 2014 ఎన్నికలకు ముందు శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఆయనపై గెలుపొందారు. భూమా మరణం అనంతరం శిల్పా తనకు టిక్కెట్ దక్కుతుందని భావించారు. కానీ చంద్రబాబు భూమా బ్రహ్మానంద రెడ్డికి ఇచ్చారు. అంతకుముందు పరిస్థితి గమనించి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. ఆయన బాటలోనే శిల్పా చక్రపాణి రెడ్డి నడిచారు.