ప్రభుత్వ పోర్టల్స్ నుండి ఆధార్ డేటా తొలగించండి:యుఐడిఎఐ ఆదేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్స్ నుండి ఆధార్ డేటాను వెంటనే తొలగించాలని యుఐడిఎఐ చైర్మన్ జె.సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్ వివరాలు లీకవుతున్నాయని నెలరోజులుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యుఐడిఎఐ చైర్మన్ జె.సత్యనారాయణస్తున్న ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఆధార్ కార్డు మరియు దానికి సంబంధించిన వివరాలను ఏ వెబ్సైట్లోనైనా ప్రచురించడం ఆధార్ చట్టం 2016 కింద నిషేధించబడిందని యుఐడిఎఐ చైర్మన్ జె.సత్యనారాయణ తెలిపారు. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లలో అక్కడక్కడా కొంతమంది ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా అందుబాటులో వుంటోందని తమకు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలిపారు.
అందువల్ల అన్ని ప్రభుత్వ విభాగాలు ఈ విషయమై తమ వెబ్సైట్లను పూర్తిగా తనిఖీ చేసుకోవాలని, మిగిలిన ఆధార్ డేటాను తొలగించాలని యుఐడిఎఐ చైర్మన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సలహాదారు అయిన జె.సత్యనారాయణ ఎపి ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు. భవిష్యత్తులో కూడా ఇలా ఆధార్ వివరాలు కనిపించకుండా వుండేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 29 కింద ఆధార్ వివరాలు వెల్లడించడం కూడా నేరం కిందకే వస్తుందని సత్యనారాయణ వివరించారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాల లబ్దిదారులకు సంబంధించిన ఆధార్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో వుంటున్నట్లుగా పలువురు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు రుజువు చేసిన విషయం ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని 89 లక్షల మంది ఎన్ఆర్ఇజిఎస్ కార్మికులు, 4.8 లక్షల మంది గర్భిణులు, 1.5 లక్షల మంది గృహ నిర్మాణ పథక లబ్దిదారులకు సంబంధించిన ఆధార్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయమై ఎవరో యుఐడిఎఐకి ఈ విషయమై ఫిర్యాదు చేసివుండవచ్చని తెలుస్తోంది. వెబ్సైట్లు హ్యాకింగ్కు గురవుతున్న నేపథ్యంలో సైబర్ భద్రత కోసం ఇటీవలే విజయవాడలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎపిసిఎస్ఓసి) నుండి సాయం తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ కార్యదర్శి (ఐటి) కె.విజయానంద్ ఇటీవల అమరావతిలో జరిగిన సదస్సులో జిల్లా కలెక్టర్లు కోరినట్లు తెలిసింది.