పంచాయితీలకు వైసీపీ రంగులు తొలగించండి .. వైసీపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే . ఒక్క ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఏకంగా స్మశాన వాటికల గోడలకు, వాటర్ ట్యాంక్ లకు సైతం వైసీపీ రంగులేయటం పలు విమర్శలకు కారణం అయ్యింది. ఇక తాజాగా ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.
అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్
పంచాయితీలు ప్రభుత్వానివి.. పార్టీ రంగులు ఉండకూడదన్న హైకోర్టు
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది . రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
పంచాయితీ ఎన్నికలు వస్తున్న కారణంగా తొలగించాలని ఆదేశాలు
పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై ఉండకూడదని , వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది . తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో వైసీపీ సర్కార్ కు షాక్
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా లెక్క చెయ్యకుండా ప్రభుత్వ కార్యాలయాలకు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులను వేస్తున్నారు . ఒక స్కూల్ గోడ మీద జాతీయ జెండాను కూడా చెరిపివేసి అక్కడ కూడా వైసీపీ రంగులు వేయడం, మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దిమ్మెకు కూడా వైసీపీ రంగులను వేయటం అప్పట్లో రాష్ట్రంలో వివాదాస్పదమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనేఆ రంగులను తొలగించేలా చేశారు. ఇక తాజాగా కోర్టు ఆదేశాలు వైసీపీ సర్కార్ కు షాక్ కొట్టినట్టు అయ్యాయి.