ప్రముఖ సంపాదకులు రామచంద్రమూర్తికి ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ..
సీనియర్ జర్నలిస్టు ప్రఖ్యాత సంపాదకులుగా, కాలమిస్ట్ గా పత్రికా రంగంలో విశేష సేవలను అందించిన కొండుభట్ల రామచంద్రమూర్తికి బంపర్ ఆఫర్ ఇచ్చింది జగన్ సర్కార్. జర్నలిజంలో ఆయనకున్న అపార అనుభవాన్ని తమ ప్రభుత్వ పాలనకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న కొండుభట్ల రామచంద్రమూర్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
30 న సచివాలయ నియామక పత్రాలు .. అక్టోబర్ 2న సచివాలయ భవనం ప్రారంభించనున్న సీఎం జగన్
రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించిన ఏపీ సర్కార్
ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇప్పుడు కొండుభట్ల రామ చంద్రమూర్తికి పబ్లిక్ పాలసీ సలహాదారుగా అవకాశం కల్పించింది. దీంతో సీనియర్ సంపాదకుడిగా పేరున్న డాక్టర్ రామచంద్రమూర్తి ప్రభుత్వానికి పబ్లిక్ పాలసీ పై సలహాదారుగా వ్యవహరిస్తారు.
డాక్టర్ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చిన నేపధ్యంలో నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. డాక్టర్ కె రామచంద్ర మూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్రమూర్తి తొలినాళ్లలో ఆర్టీసీలో పనిచేశారు.
రామచంద్రమూర్తి పాత్రికేయ ప్రస్థానం
పాత్రికేయ వృత్తి పై ఆసక్తితో ఆయన బెంగళూరులో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మొదట పని చేశారు. ఆ తరువాత ఐదేళ్లపాటు ఆంధ్రప్రభలో పని చేశారు. ఆ తర్వాత విజయవాడ నుండి ఉదయం పత్రికలో పని చేసిన ఆయన తరువాతి కాలంలో హెచ్ఎంటీవీ లో సీఈవో గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత సాక్షి సంపాదకీయ సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం అందులోని కొనసాగుతున్నారు. ప్రఖ్యాత సంపాదకునిగా, ప్రముఖ కాలమిస్టుగా , మంచి రచయితగా ఆయనకు పేరుంది.
వ్యంగ్య రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన రామచంద్రమూర్తి
తన వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేలుకొలిపే బహుముఖ ప్రజ్ఞాశాలిగా రామచంద్రమూర్తికి గుర్తింపు ఉంది. జర్నలిజంలో అపారమైన సేవలను అందించిన రామచంద్రమూర్తిని ఏపీ ప్రభుత్వం పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల లోని ప్రఖ్యాత మేధావుల్లో రామచంద్రమూర్తి ఒకరుగా గుర్తింపు పొందారు. మంచి ప్రజాదరణ పొందిన జర్నలిస్టుగా, మీడియా ప్రొఫెషనల్ గా, సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. తాడిత పీడిత వర్గ చైతన్యం కోసం కీలకంగా పనిచేసిన జర్నలిస్టుగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజీవ్ మై డార్లింగ్, అమీబా, వార్తా రచన క్రీడా భారతం, సరదాల పరదా వంటి అనేక రచనలతో ఆయన అందరి మన్ననలను పొందారు.
2004లో ప్రభుత్వానికి, మావోలకు చర్చల సమయంలో ఆయనది కీలక పాత్ర
2004లో మావోయిస్టులకు మరియు ప్రభుత్వానికి మధ్య చర్చల సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలను విభజించడం పై తరువాత ఉత్పన్నమయ్యే సమస్యలపై లోతైన అవగాహన కల్పించాలని ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక అంతే కాదు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు ను ఏపీ అసెంబ్లీలో ఆమోదింప చేయడం లో ఆయన పాత్ర ఎనలేనిది. మీడియా సంస్థలను నిర్వహించడం లోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ బలమైన పాత్ర పోషించిన రామచంద్ర మూర్తి ఇకనుండి ఏపీ ప్రభుత్వానికి తన సేవలను అందించనున్నారు.