రేణుకా చౌదరిపై గుడ్లు: తలలు తెగిపడతాయని వార్నింగ్
ఖమ్మం: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కాన్వాయ్పై అదే పార్టీకి చెందిన నాయకులు కోడిగుడ్లతో దాడి చేసిన సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా కారేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. భద్రాచలం జైత్రయాత్ర పేరుతో జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ఆదివారం కారేపల్లి మండల కేంద్రానికి వచ్చిన సమయంలో ఆమె కాన్వాయ్పై రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి వర్గానికి చెందిన వారుగా చెప్తున్న కొందరు కోడిగుడ్లను విసిరారు.
అనంతరం ఆమె అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న సమయంలో కూడా వారు రేణుకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆమె రాంరెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం కోసం ఉద్యమం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయటం సరైందికాదని, జరిగిన పరిణామాలను పార్టీ అధిష్ఠానానికి విన్నవిస్తామని అన్నారు.
తాను అరుపులకు, ఆందోళనలకు భయపడనని, సైనికుడి కూతురిగా ఎక్కడికైనా వెళ్తానని, ఎవరెన్ని చెప్పినా తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనేనని, పదిహేనేళ్ళుగా తనను ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేవుణ్ణి కాపాడుకోవాలని వస్తే కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. దమ్ముంటే తన ఎదురుగా రావాలని, తన చేతికి ఉన్న అయిదు విష్ణు చక్రాలను వదిలితే తలకాయలు తెగిపడతాయని హెచ్చరించారు.
కాగా అంతకుముందు టేకులపల్లి మండలంలోకి వచ్చే సమయంలో ఆమె వర్గానికి చెందిన కొందరిపై రాంరెడ్డి వర్గీయులు దాడి చేశారు. దీనిపై కూడా ఆమె టేకులపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు.