అంగుళం ఇవ్వం, సిఎం మాట నిజమే: రేణుకా చౌదరి
ఖమ్మం: భద్రాచలాన్ని తెలంగాణలోని ఉంచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి శనివారం కారు ర్యాలీ చేపట్టారు. యాత్ర నాయకగూడెం నుంచి ప్రారంభమైంది. భద్రాచలం వరకు ఈ రోడ్ షో సాగుతుంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని ఆమె అన్నారు. భద్రాచలం డివిజన్లోని ఒక్క అంగుళం భూమిని కూడా సీమాంధ్రలో కలపడానికి తాము అంగీకరించబోమని ఆమె చెప్పారు. భద్రాచలం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమని ఆమె చెప్పారు. హైదరాబాద్పై ఇంకా ఓ నిర్ణయమూ జరగలేదని ఆమె చెప్పారు.
రాయల తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకమని రేణుకా చౌదరి కారు ర్యాలీ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆమె బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని గానీ పార్టీ అధిష్టానాన్ని గానీ ధిక్కరించడం లేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటల్లో కొంత నిజం ఉందని ఆమె అన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆమె చెప్పారు.
విభజన వల్ల తలెత్తే సమస్యలను మాత్రమే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారని, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంపూర్ణంగా సహకరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు తెలంగాణ జైత్యయాత్రలకు తనకు పిలుపు రాలేదని, అందుకే వెళ్లలేదని ఆమె స్పష్టం చేసారు. తనను ఎఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారనే మాటలో వాస్తవం లేదని ఆమె అన్నారు.
రేణుకా చౌదరి ఇటీవల కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను ఢిల్లీలో కలిశారు. భద్రచలాన్ని తెలంగాణలో ఉంచాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. భద్రాచలం తెలంగాణలోనిదేనని ఆమె అన్నారు. ఇటీవల ఆమెను ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకులు కలిసి భద్రాచలంపై వినతిపత్రం సమర్పించారు.