పంచాయతీ భవనాలకు మళ్లీ కొత్త రంగులు: ఈ సారి కోర్టులు..వివాదాలు తలెత్తకుండా: ఆ రెండింటితోనే
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు రంగుల వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. పంచాయతీ రాజ్ భవనాల రంగుల వ్యవహారంలో ఇప్పటికే వివాదాలు, విమర్శల పాలైన వైఎస్ జగన్ ప్రభుత్వం..ఈ సారి కాస్త వెనక్కి తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు ప్రతిబింబించేలా పంచాయతీ రాజ్ భవనాలకు రంగులు పూశారంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల నుంచి ఎదురుదెబ్బలను చవి చూసిన తరువాత.. వాటి జోలికి వెళ్లలేదు. వైఎస్ఆర్సీపీ జెండా రంగులు లేకుండా.. ఈ రెండు రంగులే ఉండేలా జాగ్రత్త పడింది.
న్యాయస్థానాల ఆదేశంతో..
గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన వైఎస్ఆర్సీపీ రంగులను తొలగించాలంటూ ఇదివరకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినా.. తీర్పులో ఎలాంటి మార్పూ రాలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పార్టీ రంగులను ఎలా వేస్తారని ప్రశ్నించింది. వెంటనే వాటిని తొలగించేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులను జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఆ రెండు రంగులు వేసేలా..
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాల రంగుల విషయంపై ప్రభుత్వం రాజీ పడింది. పంచాయతీ భవనాలకు తెలుపు, టెర్రాకోట రంగులను వేయబోతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ జారీ చేశారు. పంచాయతీ భవనాలకు పైభాగంలో తెలుపు, కిందిభాగంలో టెర్రాకోట రంగులను వేయాలని నిర్ధారించారు. దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను ఆయన ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
పంచాయతీ భవనాలకు రెండు అడుగుల ఎత్తుమేర
తాజాగా జారీ చేసిన ఆదేశాల మేరకు పంచాయతీ భవనాలకు కిందిభాగం నుంచి రెండున్నర అడుగుల ఎత్తు మేరకు టెర్రాకోట రంగులను వేయాల్సి ఉంటుంది. అలాగే అడుగు భాగం నుంచి ఎనిమిది అంగుళాల వెడల్పులో బోర్డర్ డిజైన్ను ఖరారు చేసింది. ఈ బోర్డర్ డిజైన్లో గ్రామీణ, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే ముగ్గులు, ఇతర కళలను ముద్రించేలా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
గ్రామీణ, గిరిజన కళలను ప్రోత్సహించేలా
పైభాగం మొత్తం తెలుపురంగును పూస్తారు. కిందిభాగం నుంచి రెండున్నర అడుగుల మేర ఎత్తున టెర్రాకోట రంగులు, దానికి ఎనిమిది అంగుళాల మేర బోర్డర్ డిజైన్ అందులో గ్రామీణ, గిరిజన కళలను ప్రతిబింబించేలా రంగోలీలను వేయడం వల్ల.. పంచాయతీ రాజ్ భవనాలు సరికొత్త అందాలను సంతరించుకుంటాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ, గిరిజన హస్తకళలను ప్రోత్సహించినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు. పంచాయతీ రాజ్ భవనాలకు కొత్తగా నిర్ధారించిన రంగులను పూయడానికి అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని గోపాలకృష్ణ ద్వివేదీ.. కమిషనర్కు ఆదేశించారు.