చంద్రబాబు రంగంలోకి దిగారుగా, 1996 రిపీట్: కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వేసే ఎత్తుగడలు వ్యూహాత్మకంగా ఉంటాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. దేవేగౌడ వ్యూహాలు కూడా బాగున్నాయన్నారు. 1996 రాజకీయాలు జాతీయస్థాయిలో మళ్లీ పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు.
Recommended Video
మోడీ ప్రభుత్వం వేధిస్తోంది: బాబు, ప్రధాని పదవిపై రాహుల్కు ఝలక్, ప్రశంసించిన దేవేగౌడ
కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం బెంగళూరులో జేడీఎస్ అధినేత దేవేగౌడ, కుమారస్వామి తదితరులతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం వారు ముగ్గురు మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేవేగౌడ, చంద్రబాబులు పాతస్నేహితులే
దేశంలోని లౌకికవాద పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా దేవేగౌడ, చంద్రబాబు, తాను భేటీ అయ్యానని చెప్పారు. దేశంలోని పలు రాజకీయ అంశాలపై మాట్లాడామన్నారు. 2019 గురించి చర్చించామని చెప్పారు. చంద్రబాబు, దేవేగౌడలు పాత స్నేహితులేనని చెప్పారు. వారిద్దరు పలు అంశాలపై మాట్లాడారన్నారు.
2019లో 1996 పునరావృతం
చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగిన తర్వాత 1996 రాజకీయ పరిస్థితులు పునరావృతం అవుతాయని తాను భావిస్తున్నానని కుమారస్వామి చెప్పారు. 2019లో రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులు వస్తాయన్నారు. అంతకుముందు, దేవేగౌడ, చంద్రబాబు నాయుడులు కూడా మాట్లాడారు.
40 నిమిషాలు చర్చించిన ముగ్గురు నేతలు
దేవేగౌడతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, బీజేపీయేతర కూటమికి ఆయన మద్దతు కోరామని చంద్రబాబు చెప్పారు. ఎన్డీయే నుంచి తాము బయటకు రాగానే బీజేపీ తమను వేధించడం ప్రారంభించిందని చెప్పారు. కూటమి బలోపేతం కోసం అందరితో చర్చలు జరపాలని తాము చంద్రబాబును కోరామని దేవేగౌడ అన్నారు. కాగా, ముగ్గురు నేతలు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు.