అమరావతిలో శ్రీవారి ఆలయానికి ఆమోదం, 25 ఎకరాల్లో నిర్మాణం
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల శ్రీవారి తరహా ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఆమోదం తెలిపింది. టీటీడీ ధర్మకర్తల మండలి జరిగింది. ఉదయం పది గంటలకు సమావేశమైన పాలక మండలి 62 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతిలో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తొలి దశలో రూ.150 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశారు.
వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికైనా మొదట తిరుపతి గుర్తుకు వస్తుంది. తిరుపతిలో ఉన్న టీటీడీ వారు ఇతర ప్రాంతాలలో కూడా భక్తుల కోరిక మేరకు శ్రీవారి ఆలయాలను నిర్మిస్తోంది. అలాంటిది నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోను ఆలయం నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు.
తదనుగుణంగా తిరుమల వేంకటేశ్వరుడు అమరావతిలోని కొలువుదీరనున్నాడని, దానికోసం కృష్ణానది తీరాన 25ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక ధామాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే రెండు సంవత్సరాలలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.