రీపోలింగ్కు ఏర్పాట్లు పూర్తి: సజావుగా సాగేనా? రిటర్నింగ్ అధికారి సమక్షంలో..!
అమరావతి: రాష్ట్రంలో సోమవారం మూడు జిల్లాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మూడు జిల్లాల్లో అయిదు చోట్ల రీపోలింగ్ను నిర్వహించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల ప్రధాన అధికారిక గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కిందికి వచ్చే నల్లచెరువులోని 244వ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తారు. దీనితోపాటు- నెల్లూరు నియోజకవర్గం ఇసుకపల్లిలోని 41వ కేంద్రం, అదే జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్ప 197వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్కు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం కలనూతలలో 247వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించబోతున్నట్లు ద్వివేదీ తెలిపారు.
కిందటి నెల 11న నిర్వహించిన పోలింగ్ సందర్భంగా హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, ఈవీఎంలు మొరాయించడం వల్ల రీపోలింగ్ అవసరమైనట్లు చెప్పారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు.