ఎర్రచందనం స్మగ్లర్లు చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారా?
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ఈ మేరకు ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆయన హత్యకు అనంతపురం పర్యటనలో రెక్కీ నిర్వహించినట్టు సమాచారమంటూ ఆ మీడియా వ్యాఖ్యానించింది.
ఇటీవల శేషాచలం ఎన్కౌంటర్తో రగిలిపోతున్న ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రతీకారదాడికి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోందంటూ ఆంధ్రజ్యోతి వెబ్ పత్రిక రాసింది. పక్కా సమాచారం ఉండటంతో ఏపీ ఇంటెలిజన్స్ అధికారులు చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టం చేశారని తెలిపింది. జిల్లా టూర్లలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇదిలావుంటే, ఎర్రచందనం స్మగ్లర్లను కాపాడేందుకు బడా లాయర్లు రంగంలోకి దిగారు. శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్కు గురైన ఎర్రచందనం కూలీల తరఫున బంధువులు మానవ హక్కుల కమిషన్ను, హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసును వాదించేందుకు మృతి చెందిన కూలీల బంధువుల తరఫున ఢిల్లీలోని బడా లాయర్లు రంగంలోకి దిగారని ఆదే మీడియా సంస్థ రాసింది. ఆ వార్తాకథనం ప్రకారం - వీరందరూ ఒక కేసు వాదించాలంటే రూ. కోట్లలో ఫీజులు వసూలు చేస్తారు. అయితే బడా లాయర్లను రంగంలోకి దించి ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎర్ర కూలీల బంధువులకు అండగా ఉన్న అజ్ఞాత శక్తులు ఢిల్లీ స్థాయిలోని లాయర్లను రంగంలోకి దింపాయని తెలుస్తోంది.
ఈ కేసులో ఎలాగైనా ప్రభుత్వాన్ని, పోలీసులును ఇరికించాలని, స్మగర్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ, జాతీయ స్థాయి స్మగ్లర్లు రంగంలోకి దిగి భారీ ఎత్తున సొమ్ము వెచ్చించి పేరొందిన లాయర్లను రంగంలోకి దింపారని విశ్వసనీయ వర్గాల సమాచారమని వ్యాఖ్యానించింది.