విశాఖపట్నం కాదు..విజయవాడే: ఈ ఒక్కసారి ఇక్కడే: అచ్చొచ్చిన స్టేడియం..!
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత జగన్ సర్కార్.. విశాఖపట్నానికి ఫస్ట్ షాక్ ఇచ్చింది. ఈ తీర ప్రాంత నగరంలోనే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని తొలుత తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సారి విజయవాడలోనే ఈ వేడుకలను నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయించింది.
విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోనే ఈ సారి గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు అక్కడి అధికారులు. రామకృష్ణా బీచ్ రోడ్డులో కొద్దిరోజులుగా రిహార్సల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో..రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది విజయవాడలోనే గణతంత్ర దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించకపోవడానికి పెద్దగా సాంకేతిక పరమైన, భద్రతాపరమైన కారణాలేవీ లేవని అధికారులు చెబుతున్నారు. తగినంత సమయం, నివాస వసతి వంటి సౌకర్యాలు లేకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.
విశాఖలో ఈ వేడుకలను నిర్వహించాల్సి వస్తే.. ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం, ఇతర సిబ్బంది.. వారంతా అక్కడ నివసించడానికి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది. ఒక్కపూటలో వెళ్లి రావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికంటే విజయవాడలోనే ఈ ఏడాదికి గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమౌతోందని అంటున్నారు.