విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు: వేదిక ఖరారు, సీఎం జగన్, గవర్నర్ హాజరు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మాత్రం గణతంత్ర వేడుకలను విశాఖపట్నంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. వేదిక కూడా ఖరారైపోయింది. తాజాగా, విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు.
రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్, సీఎం జగన్..
కాగా, గణతంత్ర వేడుకలకు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
పరిపాలన రాజధానిగా విశాఖ..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి గణతంత్ర దినోత్సవం ఇదే కావడం గమనార్హం. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. దీనిపై హైపవర్ కమిటీని కూడా నియమించారు. ప్రస్తుతం హైపవర్ కమిటీ ఇందుకు సంబంధించిన కీలక నివేదికను సిద్ధం చేస్తోంద.
విశాఖకు జగన్ అనుకూలంగా..
కాగా, జనవరి 20న ఏపీ అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విశాఖను రాజధానిగా చేయడానికి జగన్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు రావడంతో విశాఖలోనే రిపబ్లిక్ డే నిర్వహించాలని సర్కారు నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా తమ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతుండటంతో విశాఖవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలోనే చంద్రబాబు...
అయితే, గత ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిగా రాజధానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుతోపాటు పలు భవనాలను కూడా నిర్మించారు. అమరావతి రాజధానిగా ఉండటంతో విజయవాడలోనే గత సీఎం చంద్రబాబు రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధానులు చేస్తామని ప్రకటించారు. అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు ఉంటుందని ప్రతిపాదించారు. అలాగే హైకోర్టు బెంచీలను అమరావతి, విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.