Kurnool: గ్రామ సచివాలయం వద్ద తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత: ఆరా తీస్తోన్న జిల్లా అధికారులు
కర్నూలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే.. అదే తరహా సంఘటన మరొకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద కొందరు సిబ్బంది మువ్వన్నెల పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. పూర్తి నివేదికను అందజేయాలని స్థానిక అధికారులకు సూచించింది.
జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లో నిర్మించిన గ్రామ సచివాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు సిబ్బంది.. ఆదివారం ఉదయం గ్రామ సచివాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఆ విషయాన్ని చాలాసేపటి వరకు వారు పట్టించుకోలేదు. జాతీయ గీతాన్ని ఆలపించి.. స్వీట్లను పంచి పెట్టారు. తాము తలకిందులుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసినట్లుగా ఏ మాత్రం గుర్తించలేదు.
ఈ విషయాన్ని గుర్తించిన కొందరు గ్రామస్తులు ఈ విషయాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పొరపాటును గుర్తించిన వెంటనే ఉద్యోగులు.. జాతీయ పతాకాన్ని కిందికి దించి, సరిచేశారు. మళ్లీ ఎగుర వేశారు. అప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు యథారాజా తథా ప్రజా అన్నట్లు ఉందని విమర్శిస్తున్నారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక్కరే అనుకుంటే.. క్షేత్రస్థాయి ఉద్యోగులు కూడా అలాగే మారిపోయారని చురకలు అంటిస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదోని రెవెన్యూ డివిజన్ అధికారులకు సూచించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆదోని రెవెన్యూ డివిజన్ అధికారులు ఆరా తీస్తున్నారు.