గాఢనిద్రలోనే..ఊపిరి అందక విలవిల్లాడుతూ: ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్గా: విశాఖకు జగన్..
విశాఖపట్నం: విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల వల్ల ముగ్గురు మరణించడం.. వెయ్యిమందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురి కావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. విష వాయువులను పీల్చిన స్థానికులు ఎక్కడికక్కడే సొమ్మసిల్లిపోతున్నారు. ఊపిరి అందక అల్లాడుతున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.
అంబులెన్స్ సైరన్లతో భీతావహం..
తెల్లవారు జామున 3 గంటల సమయంలో గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. విషవాయువు వల్ల కళ్లు మండుతూ, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుండడంతో ప్రజలు ఇళ్లను వదిలి రోడ్డు మీదికి పరుగులు తీస్తున్నారు. ఊపిరి అందక విలవిల్లాడుతున్నారు. ఎక్కడికక్కడ సృహతప్పి పడిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పదుల సంఖ్యలో అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. బాధితులను సమీప ఆసుప్రతులకు తరలిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ కొనసాగుతోన్న ఆర్ఆర్ వెంకటాపురం మొత్తం అంబులెన్సుల సైరన్లతో మారుమోగిపొతోంది.
విశాఖకు బయలుదేరిన వైఎస్ జగన్..
సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వినయ్చంద్కు ఆయన ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చేయి దాటుతున్నట్లు కనిపిస్తుండటంతో విశాఖపట్నానికి బయలుదేరనున్నారు. తక్షణమే తగిన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీచేశారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బలగాలు..
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. ఆర్ఆర్ వెంకటాపురానికి చేరుకున్నాయి. ప్రత్యేక వాహనాల్లో స్థానికులను తరలిస్తున్నాయి. రోడ్డు మీద, కాలువల్లో, వీధుల్లో ఎక్కడికక్కడ సొమ్మసిల్లిపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. మొబైల్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. వెంటిలేటర్లను అమర్చిన అంబులెన్స్లను సంఘటనా స్థలానికి తరలించనుంది.
అయిదు ప్రాంతాలపై ప్రభావం..
ఎల్జీ పాలిమార్స్ సంస్థ గోపాలపట్నం మండలం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో కొనసాగుతోంది. ఇక్కడ లీక్ అయిన గ్యాస్ వల్ల ఆర్ఆర్ వెంకటాపురంతో పాటు వెంకటాపురం, పద్మనాభం, బీసీ కాలనీ, కంపరపాలెం వంటి ప్రాంతాలపై తీవ్రంగా పడుతోంది. ఆయా గ్రామాల ప్రజలు తమ ఊరిని విడిచి సురక్షిత ప్రాంతాలు తరలివెళ్తున్నారు. రసాయన వాయువు అయిదు కిలో మీటర్ల మేర వ్యాపించిందని అంచనా. చాలామంది కళ్లు తిరిగి పడిపోయారు. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి.
Recommended Video
స్టైరిన్ అనే గ్యాస్ లీక్
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో విడుదలైన గ్యాస్ను స్టైరీన్గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మొన్నటి దాకా లాక్డౌన్లో ఉందీ కంపెనీ. పరిశ్రమలకు మినహాయింపులను ఇవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాయి. సుదీర్ఘ లాక్డౌన్ తరువాత ఎలాంటి ముందు జాగ్రత్తలను కూడా తీసుకోకుండా ఒక్కసారిగా కార్యకలాపాలను ప్రారంభిచడం వల్ల గ్యాస్ లీక్ అయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.