లోకేష్ సన్నిహితుడు అభీష్ట రాజీనామా, చంద్రబాబు ఓకే: కారణాలేన్నో..!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు సన్నిహితుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఉన్న ఎస్ అభీష్ట రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు.
ఆయన రాజీనామాను చంద్రబాబు ఆమోదించారు. లోకేష్ సన్నిహితుడు అభీష్టను ఓఎస్టీగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉన్నత విద్యావంతుడైన అబీష్ట తనలోని సత్తా ఆధారంగానే ఆ పోస్ట్కు ఎంపికయ్యారని వివరణ ఇచ్చారు.
అయితే సదరు పోస్ట్కు అబీష్ట మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2014 జూన్ 16వ తేదీన అభీష్ట సీఎంవోలో ఓఎస్డీగా నియమితులయ్యారు. అతను తాజాగా రాజీనామా చేయడం, వెంటనే ఆమోదించడం జరిగింది. తాను పార్టీకి (టిడిపి), ప్రభుత్వానికి.. రెండు వైపులా న్యాయం చేయలేకపోతున్నానని అభీష్ట పేర్కొన్నారు. సీఎంఓ నుంచి బయటకు వచ్చిన అబీష్ట ఇక నుంచి టీడీపీ కార్యకలాపాల్లో కీలక భూమిక పోషించనున్నారని తెలుస్తోంది.
కాగా, అభీష్ట ఐఎఎస్ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయ. లోకేష్కు సన్నిహితుడు కావడం వల్లనే అభీష్ట ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమితులయ్యారని ప్రచారంపై గతంలో ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. అభీష్టను చంద్రబాబు ఓఎస్డీగా ప్రభుత్వమే నియమించిందని స్పష్టం చేశారు.
అయితే, లోకేష్ సూచనతో అభీష్ట పార్టీ శాసనసభ్యుల తీరుపై సర్వే చేయించారు. అయితే, ఈ సర్వే ఫలితాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తనకు అనుకూలంగా ఉన్నవారికి ఒక రకంగా, మిగతావారికి మరో రకంగా ఆయన నివేదికలు ఇచ్చారనే అభిప్రాయం కూడా ఉంది.
ఆభీష్ట చేయించిన సర్వేలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారనే వాదనలు ఉన్నాయి. సర్వేలో ప్రతికూల ఫలితాలు పొందిన మంత్రులు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అభీష్టపై టిడిపిలో చాలా రోజులుగా బాగా చర్చ సాగింది.