శాసనమండలి సాక్షిగా టీడీపీ సభ్యుల్లో విభేదాలు: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు దూరంగా ఎమ్మెల్సీ
అమరావతి: శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇప్పటికే ఇద్దరు శాసన మండలి సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న కేఈ ప్రభాకర్ వైఖరి లాబీల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఆయన దూరంగా ఉన్నారు. తోటి టీడీపీ ఎమ్మెల్సీలతోనూ ఆయన కలివిడిగా లేరు. అంటీముట్టనట్టుగా కనిపించారు. శాసన మండలిలో తన వైఖరి ఏమిటనేది ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది.
బ్యాక్ టు బ్లాక్షర్ట్స్:నాడు ముఖ్యమంత్రిగా..నేడు ప్రతిపక్ష నేతగా:నల్లచొక్కాలతో చంద్రబాబు, లోకేష్
టీడీపీ వాకౌట్..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ముందు.. ఆ తరువాతా తమ నిరసనలను టీడీపీ సభ్యులు కొనసాగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా వాకౌట్ చేశారు. బీసీలను అణచివేస్తోందనే కారణంతో ఉభయ సభల నుంచి బయటికి వచ్చారు.
దూరంగా ఉన్న కేఈ
ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాత్రం సభ లోపలే ఉండిపోయారు. తోటి సభ్యులతో కలిసి ఆయన వాకౌట్ చేయలేదు. సభలోనే కూర్చుండిపోయి కనిపించారు. తమతో పాటు రావాలంటూ తోటి సభ్యులు పిలిచినప్పటికీ.. పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు కేఈ ప్రభాకర్. ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు కూడా నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ సభ్యులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాల్లో కేఈ ప్రభాకర్ పాల్గొనలేదు.
ఇదివరకే రాజీనామా
కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి స్వయానా సోదరుడు కేఈ ప్రభాకర్. టీడీపీ ఆరంభం నుంచీ ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. మూడు నెలల కిందట ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, దాన్ని అధినేత చంద్రబాబు నాయుడి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదంటూ కేఈ ప్రభాకర్ రాజీనామా చేశారు.
Recommended Video
స్థానిక సంస్థ ఎన్నికల్లో
స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో టీడీపీ నాయకులు ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారంటూ అప్పట్లో ఏకంగా చంద్రబాబును టార్గెట్గా చేస్తూ కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పార్టీ జెండాలను మోస్తోన్న తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించడానికి చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. పార్టీని వీడటానికే సిద్ధం అయ్యారు. వైసీపీ నుంచి ఆహ్వానం అందితే చేరడానికి రెడీగా ఉన్నారనేది కర్నూలు జిల్లా టాక్.