అడక్కుండా నాడు, తీర్మానం లేకుండా నేడు: టిపై గాదె
హైదరాబాద్: 2009 డిసెంబర్ 9న ఎవరినీ సంప్రదించకుండా ప్రకటన చేశారని, ఇప్పుడు తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియ ప్రారంభించారని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి గురువారం అన్నారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం సభాపతి నాదెండ్ల మనోహర్ను కలిశారు.
శాసన సభలో సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని కోరారు. శాసన సభ నియమావళి 77, 78 కింద తీర్మానం చేయాలని కోరారు. అనంతరం వారు సిఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తాము మంత్రి సాకె శైలజానాథ్ ఆధ్వర్యంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సమైక్యాంధ్ర కోసం అనేక ప్రయత్నాలు చేశామన్నారు. అనేకమంది ముఖ్య నేతలను కలిశామని చెప్పారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితర నేతలను ఎందరినో కలిశామన్నారు.
రాష్ట్ర విభజనలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. విభజన బిల్లు తీర్మానం, బిల్లు రూపంలో రెండు విధాలుగా అసెంబ్లీకి వస్తుందని ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు.
అసెంబ్లీలో సమైక్యం కోసం 77, 78 నియమావళి కింద తీర్మానం చేయాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం లేకుండానే ప్రక్రియను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
దిగ్విజయ్తో నేతల భేటీ
లేక్ వ్యూ అతిథి గృహంలో దిగ్విజయ్ సింగ్ను పలువురు నేతలు కలుస్తున్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, మంత్రులు జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు కలుసుకున్నారు.