మోడీ నా జూనియరైనా సార్ సార్ అన్నాను: బాబు, పవన్! నీకు అలవాటేమో, అవమానిస్తావా: శివాజీ షాక్
అమరావతి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే బీజేపీ పెద్దలు ఏపీకి వస్తారని, తనను లక్ష్యంగా చేసుకుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం అఖిలపక్ష సమావేశానికి వచ్చిన నేతలను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలన్నదే తన ఉద్దేశమన్నారు.
బీజేపీ నేతలు రాష్ట్రంపై పడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, నైతికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్రంతో పెట్టుకుంటే వాళ్లే నష్టపోతారన్నారు. తాను ఎన్నో పోరాటాలు చేశానని, విజయం సాధించే వరకూ రాజీపడేది లేదన్నారు. రాష్ట్రానికి నిధులను విడుదల చేయకుండా కేంద్రం ఓ దస్త్రాన్ని తొక్కి పెట్టిందన్నారు. బీజేపీ, వైసీపీలు లాలూచీ పడ్డాయని, జగన్ ఉచ్చులో ఎవరూ పడొద్దని ఈ సమావేశానికి హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులకు సూచించారు.
'కాళ్లు పట్టుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?, ఢిల్లీలో వైసీపీ ఎంపీల షో'
ముసుగువీరులను చూసుకొని బీజేపీ ధైర్యం
రాష్ట్రంలోని ముసుగు వీరులను చూసుకునే బీజేపీ ధైర్యం తెచ్చుకుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంతో ఆడుకోవాలని భావిస్తున్న వారి ఆటలు సాగనివ్వబోనన్నారు. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదన్నారు. అమిత్ షా ఉపయోగిస్తున్న పదజాలాన్ని జాతీయ స్థాయిలో ఏ నేత కూడా ఇంతవరకూ వాడలేదన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన రాగాల వెంకట రాహుల్ను చూసి ఢిల్లీలోని పెద్దలు బాధపడుతూ ఉండవచ్చని వ్యాఖ్యానించారు. ఇకపై పతకాలన్నీ సింధు, శ్రీకాంత్ వంటి మన క్రీడాకారులకే వస్తాయన్నారు.
మోడీ నాకు జూనియర్, నేను మోడీ వద్దకు వెళ్లలేదు
నరేంద్ర మోడీ రాజకీయాల్లో తనకు జూనియర్ అని, కానీ ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అన్నారు. అతని ఈగోను సంతృప్తిపర్చేందుకు తాను గౌరవిస్తానని చెప్పారు. ఏపీకి న్యాయం చేస్తామని 2014 ఎన్నికల సమయంలో మోడీ హామీ ఇచ్చారన్నారు. గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని తానే అన్నారు. పొత్తు కోసం నాడు తాను మోడీ వద్దకు వెళ్లలేదని, ఆయన తన వద్దకు వచ్చారని, కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని, కాబట్టి మనం చేతులు కలుపుతామని చెప్పారని అన్నారని, అందుకు తాను సంసిద్ధత వ్యక్తం చేశానని చెప్పారు.
ఏపీ కోసం సార్ సార్ అన్నాను
మోడీ ఒక నియంత తరహా నాయకుడు అని, మేం అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వస్తే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు ఉండేవని, ప్రధాని ఇక్కడకు వచ్చినప్పుడల్లా సార్, సార్ అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అహాన్ని సంతృప్తిపరచడానికి కూడా వెనుకాడలేదని, మోడీ రాజకీయాల్లో నాకంటే జూనియర్ అయినప్పటికీ ప్రధాని పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చానని చెప్పారు.
జగన్, పవన్ కళ్యాణ్లకు చురకలు
రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, వైసీపీ అధినేత జగన్ తనను ఉద్దేశించి బావిలో పడి చావాలనడం దురదృష్టకరమని, తనను తిట్టిన ప్రతిపక్ష నాయకుడినీ తాను జగన్ గారు అని అంటానని చంద్రబాబు చెప్పారు. అవిశ్వాసానికి అందరూ సిద్ధమైతే తాను ఢిల్లీకి వెళ్లి ఎంపీల మద్దతు కూడగడతానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. అఖిల పక్షానికి కాంగ్రెస్ కూడా రాలేదని, అందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారన్నారు.
చంద్రబాబుకు సూచనలు
ఇదిలా ఉండగా అఖిల పక్ష సమావేశంలో నేతలు చంద్రబాబుకు పలు సూచనలు చేశారు. జాతీయస్థాయిలో మీరు బాధ్యత తీసుకోవాలని, రాష్ట్రాలను బలహీనం చేసే కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. అప్పుడు అన్ని పార్టీలు మీతో కలిసి వస్తాయన్నారు. సమావేశానికి రాని పార్టీలతో మరోసారి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో ఉద్యమం కొత్త పుంతలు తొక్కాలన్నారు. చలసాని శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, నటుడు శివాజీ తదితరులు చంద్రబాబుకు సూచనలు చేశారు.
అవమానించారు, పవన్ ఇలాంటి సమావేశాలు పెడతారేమో
చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతోనే కేంద్ర పెద్దల్లో కంగారు ప్రారంభమైందని నటుడు శివాజీ అన్నారు. ఇప్పటి వరకు రహదారుల దిగ్బంధం, పాదయాత్రలు చేశామని, ఇప్పుడు విజయవాడ రైల్వేస్టేషన్లో మౌనపోరాటం చేద్దామని, అప్పుడు కేంద్రం దిగి వస్తుందని సూచించారు. అఖిల పక్షం టీడీపీ సమావేశం కాదన్నారు. ప్రభుత్వ సమావేశం అన్నారు. అఖిలపక్షం కాఫీ, టీల సమావేశని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించి ఈ సమావేశానికి వచ్చే వారిని అవమానించారన్నారు. ఆయన నిర్వహించే సమావేశాలు అలాంటివేమో అన్నారు. తాను ముందే చెప్పినట్లు ఆపరేషన్ గరుడ ఇప్పటికే మొదలైందన్నారు.
వెంకయ్య బాధ్యత తీసుకోవాలి
కేంద్రం అహంకారపూరితంగా పార్లమెంటును నడిపించిందని కొణతాల రామకృష్ణ అన్నారు. మోడీ ప్రజల విశ్వసనీయత కోల్పోయారన్నారు. హోదా కోసం రాష్ట్రంలోనూ అన్ని పార్టీలు కలిసి రావాలని, ఇప్పుడు నిందారోపణలు, శవపరీక్షలు వద్దని, సీఎంగా ఒక మెట్టు తగ్గి మిగిలిన పార్టీలకు ఫోన్ చేసి ఆహ్వానించాలని, అయినా రాకపోతే ప్రజలే నిర్ణయిస్తారని సూచించారు. హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. రాబోయే కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని చలసాని శ్రీనివాస్ అన్నారు.