వ్యవస్థలో బాద్యతాయుత రాజకీయాలు రావాలి..!అప్పుడే ప్రజాస్వామ్య గొప్పదనం తెలుస్తుందన్న పవన్..!
అమరావతి/హైదరాబాద్ : భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని, బాద్యతతో కూడుకున్న జవాబుదారీ తనం రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతమైనప్పుడే దాని గొప్పదనం తెలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. అనుకోని విపత్తు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం ఉండే వ్యవస్థ రూపుదిద్దుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాల్సిన తరుణం కూడా ఇదే అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులను బలంగా ప్రశ్నించాలని పవన్ పిలుపునిచచ్చారు. మూకుమ్మడిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాయకులందరిని తరిమికొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!
జవాబుదారీ తనం ఉండాలి.. అప్పుడే ప్రజలు ఆదరిస్తారన్న పవన్ కళ్యాణ్..
కరోనా వైరస్ క్లిష్ట సమయంలో ఏపిలోని ప్రతి జిల్లా నుంచి సమాచారం వస్తోందని, అధికార పక్ష నాయకుల వ్యవహార శైలి గురించి కూడా సమాచారం తెలుస్తూనే ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కరోనా విపత్తు వేళ రాజకీయాల కంటే సేవా భావమే ముఖ్యమని పవన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు. క్లిష్ట సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా వ్యవస్థలోని వ్యక్తులు పని చేస్తే తప్పకుండా నిలదీయాలని అన్నారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నాయకులకు టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ కరోనా వల్ల అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయని అన్నారు.
సమస్యలను విస్మరించే ప్రతినిధులపై తిరగబడాలి.. పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్ధేశం..
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వలస కార్మికులు, మత్స్యకారులు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారని, వారి గురించి జనసేన నాయకులు క్షేత్ర స్థాయి నుంచి సమాచారం అందించగానే స్పందించడం జరిగిందని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, గుజరాత్ అధికారులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సత్వరమే స్పందించారని, జనసేన పార్టీ నిబద్ధతతో ప్రజల కోసమే నిలిచిందనడానికి ఇలాంటి పరిణామాలే పెద్ద ఉదాహరణ అని గబ్బర్ సింగ్ అభివర్ణించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన అండగా నిలబడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత జవాబుదారీతనంగా ఉన్నామనేదే ముఖ్యమని పవన్ తెలిపారు.
పార్టీ నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్.. క్లిష్ట సమయంలో ప్రజలవెంట ఉండాలని పిలుపు..
అంతే కాకుండా ఉపాధి వెతుక్కొంటూ వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళినవారు తిరిగి వస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధి కోసం ఎక్కడకు వెళ్ళినా తిరిగి తమ గూటికి వెళ్లడానికే మొగ్గు చూపుతారన్న అంశాన్ని ఊటంకించారని పవన్ గుర్తు చేసారు. సుదూర ప్రాంతాల నుండి స్వస్థలాలకు చేరుతున్నవారిని ఆదరించాలని, వారి ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ చూపాలని పవన్ కోరారు. వారి కోసం ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు లేవనీ, వైద్య సదుపాయాల కల్పన సక్రమంగా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.
లాక్డౌన్ సడలింపుల తరవాత మరింత జాగ్రత్త.. కరోనా బాదితులపట్ల సేవా భావంతో ఉండాలన్న పవన్..
ఇలాంటి అంశాల పట్ల జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు దృష్టి సారించి, సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. సమస్య తీవ్రతను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని, కరోనాకు సంబంధించిన పరీక్షలు కూడా ఎక్కువగా చేయడం లేదనీ, పాజిటివ్ కేసులు ప్రకటిస్తున్న వాటికంటే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటున్న విషయం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ కోరారు. అంతే కాకుండా లాక్డౌన్ సడలింపుల తరవాత మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్న సందర్బంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.