కొడుకు పట్టించుకోవట్లేదు...తోటి ఉద్యోగి మోసం చేశాడు:నేను చచ్చిపోతా...పర్మిషన్ ఇవ్వండి
గుంటూరు:వృద్ధాప్యంలో అనుకోని విధంగా ఎదురైన సమస్యల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని...ఇక తనకు చావే గతి అంటూ చచ్చిపోవడానికి పోలీసు ఉన్నతాధికారికి గుంటూరులో ఓ రిటైర్డ్ ఉద్యోగి చేసుకున్న విన్నపం కలకలం సృష్టించింది.
ముదిమి వయసులో అండగా ఉండాల్సిన కొడుకు అసలు పట్టించుకోవడం లేదని...మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తానని తోటి ఉద్యోగి తన ద్వారా పలువురి దగ్గర నుంచి రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆ సీనియర్ సిటిజన్ వాపోతున్నాడు. దీంతో డబ్బులిచ్చిన వారు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని...ఇక తనకు చావే శరణ్యం అని...అందుకే కారుణ్య మరణానికి అనుమతివ్వండి అంటూ ఒక రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు విజ్ఞప్తి చేశారు.
సోమవారం గుంటూరు అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పురావస్తు శాఖ విశ్రాంత ఉద్యోగి పి.రామచంద్రరావు ఎస్పీ విజయారావును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందించారు. రామచంద్రరావు ప్రస్తుతం గుంటూరు శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అనారోగ్య కారణంగా రామచంద్రరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) చేసి పెద్ద కుమారుడు పి.సురేష్ కుమార్కు అదే శాఖలో ఉద్యోగం ఇప్పించారు.
మరోవైపు తనతో పాటు గోల్కొండలో ఏడేళ్లపాటు అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించిన తోటి పురావస్తు శాఖ ఉద్యోగి మల్లెల శివకుమార్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే పలువురి నుంచి రూ.25 లక్షలు ఇప్పించానన్నారు. అయితే అతడు ఆ డబ్బు తీసుకుని మోసం చేశాడని రామచంద్రరావు ఆరోపించాడు. డబ్బు చెల్లించిన వారు తనపై నిత్యం వేధింపులకు, బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కుమారుడికి ఉద్యోగం వచ్చేందుకు గాను రూ.6 లక్షలు అప్పు చేసి, ఖర్చు పెట్టానని...అయితే ఆ డబ్బును కూడా తన కుమారుడు ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. ఈ పరిస్థితుల్లో తనకు చావే శరణ్యమని...తాను చనిపోవడానికి వీలుగా కారుణ్య మరణానికి అనుమతివ్వాలని ఎస్పీ ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదని రామచంద్రరావుపై నమోదైన కేసు వివరాలు తీయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఆ కేసును క్షుణ్నంగా పరిశీలించి దర్యాప్తు జరపాలని, రామచంద్రరావుకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డీఎస్పీని ఆదేశించారు.