రాజువయ్య, మహారాజువయ్య! వైఎస్ జగన్కు మాజీ ఐఎఎస్ రత్నప్రభ శుభాకాంక్షలు
బెంగళూరు: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రిలాగే అద్భుతంగా పరిపాలించగలరని అకాంక్షించారు. ఈక్షణమే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు నిజంగా శాంతి చేకూరి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. సుపరిపాలనకు వైఎస్ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారని అన్నారు. తాను పనిచేసిన అత్యద్భుత ముఖ్యమంత్రుల్లో వైఎస్ ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటారని చెప్పారు. ప్రజలను అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి అని వైఎస్ స్మృతులను గుర్తు చేసుకున్నారు. వైఎస్ శరవేగంతో నిర్ణయాలు తీసుకునే వారని, ఆయన ఆలోచనలన్నీ అత్యున్నతమైనవని అన్నారు. అలాంటి నాయకుడి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ బాధపడుతూ ఉండొచ్చని అన్నారు.
పదేళ్ల కిందట 2009 సెప్టెంబర్ 2వ తేదీన డైనమిక్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారని గుర్తు చేసుకున్నారు. పదేళ్లు తిరగక ముందే- ఆయన కుమారుడు అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఇప్పుడే వైఎస్ ఆత్మకు శాంతి చేకూరి ఉంటుందని చెప్పారు. వైఎస్ను రాజువయ్యా, మహారాజువయ్యా అంటూ ట్విట్టర్లో కొనియాడారు.
కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ.. చాలాకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేశారు. గనులు, భూగర్భ వనరులు, రవాణా వంటి కొన్ని కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను ఆమె దగ్గరి నుంచి చూశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.
గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కేసుల్లో రత్నప్రభపైనా కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆమె న్యాయస్థానాల చుట్టూ తిరిగాల్సి వచ్చింది. అయినప్పటికీ- ఏ మాత్రం బెదరలేదు. తాను గానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ తప్పు చేయలేదని ఆమె విశ్వసించారు. విచారణను ఎదుర్కొన్నారు. నిర్దోషిగా బయటికి రాగలిగారు. జగన్ ఆస్తుల కేసులో రత్నప్రభ ప్రమేయం ఏదీ లేదంటూ న్యాయస్థానం ఆమెపై నమోదైన కేసులను కొట్టి పడేసింది.
అనంతరం స్వరాష్ట్రానికి వచ్చిన ఆమె కర్ణాటక ప్రభుత్వంలో కొనసాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న తొలి మహిళా అధికారిణిగా రత్నప్రభ రికార్డు సృష్టించారు. గత ఏడాది ఆమె పదవీ విరమణ చేశారు. ఇన్నేళ్లయినప్పటికీ- వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. వైఎస్ జగన్కు తన శుభాకాంక్షలను తెలియజేశారు.