వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ
బెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో కొన్ని కీలక ప్రాజెక్టుల్లో తాను భాగస్వామ్యురాలిని అయ్యానని, అందుకు తనకు గర్వంగా ఉందని అన్నారు. ఏపీని మలుపు తిప్పిన, చారిత్రాత్మకమైన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను తాను దగ్గరుండి రూపొందించానని చెప్పారు.
చేతికి అందేంత దూరంలో చందమామ! చంద్రయాన్-2..ఇక విక్రమ్: వేరుపడ్డ ల్యాండర్!
ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని కీలక శాఖల్లో పనిచేశారు రత్నప్రభ. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రెండు కీలకమైన విధానపత్రాలు, సైబరాబాద్ అభివృద్ధి, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు వంటి నిర్ణయాలను తీసుకోవడం, వాటిని అమలు చేయడంలో తాను భాగస్వామ్యురాలిని అయ్యానని తెలిపారు. మహిళలకు స్టాంప్ డ్యూటీలో ఒకశాతం రాయితీని ఇస్తూ వైఎస్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెప్పారు. వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ రత్నప్రభ.. ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో రత్నప్రభ ఆరోపణలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆమె న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. అనంతరం స్వరాష్ట్రానికి వచ్చిన ఆమె కర్ణాటక ప్రభుత్వంలో కొనసాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న తొలి మహిళా అధికారిణిగా రత్నప్రభ రికార్డు సృష్టించారు.
గత ఏడాది ఆమె పదవీ విరమణ చేశారు. రత్నప్రభ వైఎస్ ను గుర్తు చేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు- రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా కూడా ఆమె వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. సుపరిపాలనకు వైఎస్ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారని, తాను పనిచేసిన అత్యద్భుత ముఖ్యమంత్రుల్లో వైఎస్ ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటారని, తండ్రిలాగే సుపరిపాలనను అందించాలని రత్నప్రభ అప్పట్లో ట్వీట్లు చేశారు.
Remembering the Chief Minister who gave me an opportunity to draft 2 IT Policies of AP,dev Cyberabad, tier 2 cities & jobs to rural youth,gave the historical 1% discount for women on stamp duty, ensured pensions to reach on 1st of every month, jobs to RTCEmployees ...YSR Garu🙏🙏 pic.twitter.com/1qAIgkWLG5
— Ratna Prabha (@Ratnaprabha_IAS) September 2, 2019