చంద్రబాబు మనోభావాలు దెబ్బ తీసారు: క్షమాపణలు చెప్పాలి: గవర్నర్ కు ఐఏయస్ల ఫిర్యాదు..!
Recommended Video
టిడిపి అధినేత చంద్రబాబు మీద రిటైర్డ్ ఐఏయస్ లు ఫైర్ అయ్యారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం..సీఈఓ ద్వివేదీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై వారు ఆగ్రహంగా ఉన్నారు. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను కలిసిన అధికారులు ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించారు.
గవర్నర్ తో మాజీ అధికారుల భేటీ..
రిటైర్డ్ ఐఏయస్ ఫోర్ ఏపి అండ్ తెలంగాణ సభ్యులు గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. 33 మంది రిటైర్డ్ అధికారులు సంతకం చేసిన విజ్ఞాపన పత్రాన్ని గవర్నర్ కు అందచేసారు. ఎన్నికల వేళ టిడిపి అధినేత చంద్రబాబు ఎల్వీ సుబ్రమణ్యం..ద్వివేదీ పై చేసిన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సంఘం ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునీతను ఎన్నికల విధలు నుండి తప్పించి, ఆయన స్థానంలలో ఎల్వీ సుబ్రమణ్యంను నూతన సీయస్గా నియమించింది. దీంతో తమతో సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం..ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్లి ద్వివేదీ మీద చంద్రబాబు అనుచితంగా వ్యవహరించారని ప్రచారం జరిగింది.
ఎల్వీ ఓ కోవర్టు.. ద్వివేదీ ఇలా..
టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఓ కోవర్టు అంటూ వ్యాఖ్యానించారు. ఎల్వీ జగన్ తోపాటుగా సహ ముద్దాయి అని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం ఎల్వీ పైన ఉన్న కేసులను కోర్టు కొట్టివేసిందని...ఆయన పై నమోదు అయిన కేసులు రాజకీయ ఉద్దేశంతోనే దాఖలయ్యాయని వివరించారు. ఇక, అదే విధంగా ఎన్నికల పోలింగ్ ముందు రోజు సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ద్వివేదీ తో అనుచితంగా వ్యవహరించారనే వాదన ఉంది. అప్పుడూ ఆ తరువాత ద్వివేదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై రిటైర్డ్ ఐఏయస్ అధికారుల ఫోరం అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటుగా అందోళన వ్యక్తం చేసింది.
బాబు క్షమాపణలు చెప్పాలి..
గవర్నర్ తో సమావేశమైన తరువాత రిటైర్డ్ అధికారులు మాట్లాడుతూ గవర్నర్ కు తమ నిరనస తెలియచేశామని చెప్పుకొచ్చారు. ఐఏయస్ల మనోభావాలు దెబ్బ తినేలా చంద్రబాబు మాట్లాడారని గవర్నర్కు ఫిర్యాదు చేసారు. సీఈవోను బెదిరించటం దారుణమన్నారు. భవిష్యత్లో ఇలా జరగకుండా జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరినట్లు అధికారులు తెలిపారు. కోర్టు కేసులు కొట్టి వేసిన తరువాత ఎల్వీ సుబ్రమణ్యం పై వ్యాఖ్యలు సరి కాదన్నారు. సీఈవో ద్వివేదికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మెజారిటీ అధికారులు నిజాయితీగా ఉన్నారని..దీని కారణంగానే సిస్టమ్ ఇంకా నడుస్తోందన్నారు. సీఈవో..సీయస్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి వ్యవహరించారని.. దీని పై ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.