జగన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ల షాక్ ? కేంద్రం సాయం కోరే అవకాశం-అదే జరిగితే భారీ నష్టం
ఏపీలో నానాటికీ దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితితో జీతాలు, పింఛన్లు సకాలంలో ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇప్పుడు కొందరు రిటైర్డ్ ఐఏఎస్ లు భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అసలే అప్పులతో నడుస్తున్న ప్రభుత్వంలో తమకు పింఛన్లు సకాలంలో అందడం లేదని ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు అఖిల భారత అధికారులు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం జగన్ సర్కార్ కు తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
అప్పులాంధ్రప్రదేశ్
ఏపీలో భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి గుదిబండగా మారిపోతున్నాయి. ఆర్ధిక పరిస్ధితి దారుణంగా ఉందని తెలిసీ భారీ ఎత్తున హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్న వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోంది. రోజురోజుకూ పరిస్ధితులు దిగజారుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వ సేవలో తరిస్తున్న తమకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా సామాజిక పింఛన్ల కోసం డబ్బులు కేటాయించడాన్ని అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఎన్నడూ లేనంత అసంతృప్తి కనిపిస్తోంది.
తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ
ఏపీ ప్రభుత్వం తమకు చట్టబద్ధంగా రావాల్సిన జీతాలు, పెన్షన్లను సకాలంలో ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు, పింఛన్ దారులు ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడం, డీఏల కోసం కూడా దేబిరించాల్సిన పరిస్దిైతి రావడంతో వారంతా రగిలిపోతున్నారు. ఇక ప్రభుత్వం చర్యల్ని ఎట్టిపరిస్దితుల్లోనూ ఉపేక్షించరాదని భావిస్తున్న ఉద్యోగులు, పింఛనర్లు పోరుకు సిద్దమవుతున్నారు.
కేంద్రం సాయం కోరనున్న రిటైర్డ్ ఐఏఎస్ లు
జగన్ సర్కార్ సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కింది స్ధాయి పింఛనర్లతో పాటు తమకూ సకాలంలో పింఛన్లు ఇవ్వకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంటున్న కొందరు రిటైర్డ్ ఐఏఎస్ లు కేంద్రం సాయం కోరేందుకు సిద్ధమయ్యారు. రేపో మాపో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తమ వ్యధల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. జగన్ సర్కార్ తమకు సకాలంలో పింఛన్లు ఇవ్వకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని కేంద్రానికి ఫిర్యాదు రూపంలో ఇవ్వబోతున్నారు.
నేరుగా పెన్షన్ ఇవ్వాలని కోరే అవకాశం
అఖిల భారత సర్వీసు అధికారులకు పెన్షన్లు కేంద్రమే ఇస్తుంది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అఖిల భారత సర్వీసు అధికారులకు ఇచ్చే పెన్షన్లను కేంద్రం వారికి తిరిగి చెల్లిస్తుంటుంది. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటూ తమకు పింఛన్లు ఆలస్యం చేస్తున్నందున... ఇకపై కేంద్రమే తమకు నేరుగా పించన్లు ఇవ్వాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కోరబోతున్నారు. అదే జరిగితే జగన్ సర్కార్ చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్రం ఒప్పుకుంటే భారీ షాక్
కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సర్వీసు అధికారులకు ఇస్తున్న పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వారికి అందించడం లేదనే వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ ల నుంచి ఫిర్యాదు వెళితే జాతీయ స్ధాయిలో ఏపీ సర్కార్ అభాసు పాలవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ లకు తామే పెన్షన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే అది అంతకు మించిన డ్యామేజ్ కు కారణమవుతుంది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ ల అభ్యర్ధనను కేంద్ర మన్నిస్తుందా లేదా అనే దానిపై మాత్రం చర్చ జరుగుతోంది. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ లు కేంద్రానికి ఫిర్యాదు చేసే వరకూ జగన్ సర్కార్ తెచ్చుకుంటుందా లేక సకాలంలో వారికి పెన్షన్లు చెల్లించి అపప్రద నుంచి బయటపడుతుందా అన్నది తేలాలంతే మరికొన్ని రోజులుగా ఆగాల్సిందే.