మొన్న కియాపై... నేడు ఏపీ మూడు రాజధానులపై రాయిటర్స్ కథనం .. ఆసక్తికర చర్చ
ఏపీలో ఇటీవల కియా మోటార్స్ తరలిపోతుంది అని సంచలన కథనాన్ని ప్రచురించి విమర్శల పాలైన రాయిటర్స్ మరోమారు ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ నిర్ణయంపై అనుకూలంగా కధనాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రచురించటం ఏపీలో చర్చనీయంశంగా మారింది . జగన్ మూడు రాజధానుల నిర్ణయం మంచిదని కితాబిస్తూ ఈ కథనం సాగింది.
సీఎం జగన్ తాజా వ్యూహం ..మూడు రాజధానుల కోసం.. టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ కార్యాచరణ
అధికార వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ఒక నమూనా అన్న రాయిటర్స్
ఇక రాయిటర్స్ అందించిన కథనంలో అధికార వికేంద్రీకరణ అనేది అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ఒక నమూనాగా నిలుస్తుందని తన కధనంలో వెల్లడించింది. ఇక అంతేకాదు రాజధాని తరలింపు అనేది పక్కా ప్రణాళికతో జరగాలని అభిప్రాయపడింది. అయితే, రాజధాని, కార్యాలయాల తరలింపు అనేది పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో సాగితేనే మంచి ఫలితం ఉంటుందని రాయిటర్స్ తన కథనంలో వివరించింది . సరైన ప్రణాళిక లేకపోతే భూమి, నీరు వంటి వనరులపై తీవ్ర ప్రభావాలుంటాయని హెచ్చరించింది.
రాజధాని , పరిపాలన ఒకే చోట ఉండాలనే రూలేమీ లేదని కథనం
పరిపాలనా వ్యవస్థను వికేంద్రీకరించటం వల్ల ఎలాంటి నష్టం ఉండబోదని వ్యాఖ్యానించింది .ఇక పరిపాలన వ్యవస్థను వికేంద్రీకరించడం కూడా కొత్తేమీ కాదని అభిప్రాయపడిన రాయిటర్స్ రాజధానిలోనే చట్టసభలు, సచివాలయం, హైకోర్టు అన్నీ మూసపోసినట్లు ఒకే చోట ఉండాలనే నిబంధన ఏమీ లేదని పేర్కొంది. ఒక్క రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి జరగడం వల్ల , ఒకే రాజధాని ఉన్న భారత్లోని అనేక రాష్ట్రాల్లో ఆర్థిక వృద్ధి తగ్గిందని తెలిపింది రాయిటర్స్.
ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడానికి వికేంద్రీకరణే సాధనం
రాష్ట్ర భౌగోళిక స్వరూపం, ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న సంకల్పం మంచిదని రాయిటర్స్ తెలిపింది. మూడు రాజధానులు చెయ్యటం తప్పేమీ కాదని పేర్కొంది . వికేంద్రీకరణ జరిగితే ఒకే రాజధానిగా ఇంతకాలం ఉన్న రాజధాని నగరాలకు రద్దీ తగ్గుతుందని అభిప్రాయపడింది . వికేంద్రీకరణ చాలా అవసరమని పేర్కొన్న రాయిటర్స్ ఉద్యోగాలు సృష్టించడానికి, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడానికి వికేంద్రీకరణే సరైన నిర్ణయం అని అభిప్రాయపడింది .
మొన్న కియాపై కథనం వివాదం .. నేడు మూడు రాజధానుల కథనం ఆసక్తికరం
ఇక ఇటీవల ఏపీ సర్కార్ పై ప్రతిపక్ష పార్టీలు మాటల దాడి చేసేలా కియా మోటార్స్ ఏపీ నుండి తరలిపోతుంది అని సంచలన కథనం ఇచ్చి వివాదాస్పదం అయిన రాయిటర్స్ తాజాగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం , పరిపాలనా వికేంద్రీకరణపై సానుకూల కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఇది ఏపీలో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .