రేవంత్రెడ్డిని కేసీఆరే హీరోగా!: అక్బర్, బీజేపీ విస్మయం
హైదరాబాద్: శాసన సభలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తోందని, తద్వారా ఆయనను హీరోను చేస్తోందని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం వ్యాఖ్యానించారు.
అధికార పార్టీ పట్టుబడుతోంది కనుక రేవంత్ రెడ్డి కూడా ఒక మెట్టుదిగి క్షమాపణ చెబితే సమస్య సమసిపోతుందన్నారు. అయితే, క్షమాపణ అంశాన్ని సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తే సరిపోయేదని అభిప్రాయపడ్డారు. గురువారం లాబీల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అంశం పైన ముఖ్యమంత్రి ప్రతిసారి స్పందించడం బాగా లేదని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి పైనే చర్చ కేంద్రీకృతం కావడం పైన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభ లోపల, బయట అంతా ఆయన పైనే చర్చ సాగుతోందన్నారు.
కాగా, రేవంత్ రెడ్డి గురువారం ఆసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఒకప్పుడు తెరాస నేత కదా అని విలేకరులు ప్రశ్నించగా.. తాను ఎంతమాత్రం తెరాస వ్యక్తిని కాదని, తాను ముమ్మాటికీ టీడీపీ నేతనేనని చెప్పారు.
ఓ పిట్ట కథ చెప్పారు. హైదరాబాద్ నుంచి రైల్లో ఢిల్లీ వెళుతుండగా, నీటి కోసం లక్నోలో దిగినంత మాత్రాన ఆ నగరం మనది కాదన్నారు. అలాగే ఎక్కడికి వెళ్లినా మనది హైదరాబాదేనని, ఎన్నిచోట్ల ఆగినా అంతిమంగా ఢిల్లీ చేరిన తర్వాతే రైలు దిగుతామన్నారు. తాను కూడా లక్నోలో ఆగిన మాదిరిగా తెరాసలో కొన్నాళ్లు ఉన్నానన్నారు.