ఆనాడు వైఎస్ ధనయజ్ఞం.. నేడు కేసీఆర్ దోపిడీ యజ్ఞం : రేవంత్
హైదరాబాద్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలుపెట్టిన పులిచింతల, పోలవరం ప్రాజెక్టులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుపడలేదని రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర రావు ప్రశ్నించిన నేపథ్యంలో.. ఆ ప్రశ్నలను తిప్పికొడుతూ ధీటుగా స్పందించారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.
విద్యాసాగరరావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆరోజు కాంగ్రెస్ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదో చెప్పాల్సిన అవసరం టీఆర్ఎస్ పై, విద్యాసాగర్ రావుపై ఉందని నిలదీశారు రేవంత్. పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాటు ప్రాజెక్టుల నిర్మాణం కోసం వైఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచి నిధులు కేటాయిస్తుంటే.. ఆనాడు కేంద్రంలోను, రాష్ట్రంలోను భాగస్వామిగా ఉన్న టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపలేదని రేవంత్ ప్రశ్నించారు.
మంత్రివర్గంలో ఉన్న ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు ఆనాడు వైఎస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు రేవంత్. కాంగ్రెస్ ప్రజెంటేషన్ కు సీఎం లేదా సాగునీటి మంత్రి హరీశ్ సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రజల్లో విశ్వాసమున్న విద్యాసాగర రావు వంటి వారిని ముందుపెట్టి ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.
ప్రాజెక్టుల టెండర్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలను బేఖాతరు చేసిందన్న తరహాలో రేవంత్ వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు చేపట్టిన అనుభవం లేకపోయినా.. టీఆర్ఎస్ లో చేరాడన్న కారణంతో ఓ ఎంపీకి చెందిన కొత్త కంపెనీకి వెయ్యి కోట్ల రూపాయిల విలువైన డిండి ప్రాజెక్టులు అప్పగించారని దుయ్యబట్టారు. 'సాగునీటి ప్రాజెక్టుల సాకుతో ఆనాడు వైఎస్ ధనయజ్ఞం చేస్తే.. నేడు సీఎం కేసీఆర్ దోపిడీ యజ్ఞం చేస్తున్నారంటూ' ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం కేసీఆర్ లో వైఎస్ ఆత్మ చొరబడిందని.. పార్టీ ఫిరాయించిన వారికి, పక్క రాష్ట్రం వారికి కాంట్రాక్టులు కట్టబెడుతుంటే.. విద్యాసాగర రావు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదని అన్నారు రేవంత్. ప్రభుత్వ మెప్పు పొందడం కోసం కోదండరాం లాంటి మేధావులను టార్గెట్ చేయడం విద్యాసాగర్ రావుకు తగదన్నారు రేవంత్. టీడీపీ నేతలు మల్లయ్య యాదవ్, మేడిపల్లి సత్యంతో కలిసి ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.