వైఎస్ వారసత్వం: కెసిఆర్పై రేవంత్, పోటీ పడాలి: జీవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం మండిపడ్డారు. హామీల అమలులో తెరాస ప్రభుత్వం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వారసత్వంలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో కొత్త జిల్లాల ప్రతిపాదనల పైన చర్చించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ జిల్లాలను మహబూబ్ నగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడనున్న వనపర్తిలో కలిపితే ఊరుకునేది లేదన్నారు. కెసిఆర్ మొదటి నిర్ణయంలోనే రైతులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టారన్నారు. రుణమాఫీ నిబంధనలపై అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు. రేవంత్ రెడ్డి సిఎస్ను కలిశారు.
రుణమాఫీపై విహెచ్
తెరాస ప్రజలకు ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ముఖ్యమైనదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. వెంటనే రైతులకు రుణమాఫీని చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.
రుణమాఫీపై కిసాన్ సెల్
తెలంగాణ రాష్ట్రంలో రూ.25వేల కోట్ల రైతు రుణాలు ఉన్నాయని, వాటిని మాఫీ చేయాలని కిసాన్ సెల్ డిమాండ్ చేసింది.
పోటీ పడాలి: రాజశేఖర్
ముఖ్యమంత్రి కెసిఆర్ను గురువారం పలువురు కలుసుకున్నారు. హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితలు కలిశారు. అలాగే మాజీ డీజీపి దినేష్ రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. ఆర్టీసి యూనియన్ నేతలు కలిసి 14న యూనియన్ సభలకు రావాలని కోరారు. కెసిఆర్ను కలిసిన అనంతరం రాజశేఖర్, జీవితలు మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. ఆంధ్ర, తెలంగాణ వేరు అయినా అందరూ తెలుగువారేనని కెసిఆర్ చెప్పారని, దానికి ఆయనను తాము అభినందిస్తున్నామని జీవిత చెప్పారు.
9 నుండి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 11న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 12న బిఏసీ సమావేశం ఉంటుంది. 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది.